వినాయక నగర్, ఏప్రిల్ 12: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యలో శుక్రవారం పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట వద్ద నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజీవ్, ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేశ్, అనిల్, మనోజ్ వాహనాల తనిఖీ నిర్వహించగా.. మోర దీపక్ అనే వ్యక్తి వద్ద ఉన్న రూ.7 లక్షల నగదును పట్టుకున్నారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నదని, అనుమతి లేకుండా డబ్బులను తరలించకూడదని నగర సీఐ నరహరి సూచించారు. స్వాధీనం చేసుకున్న నగదును నిజామాబాద్ ట్రెజరీ విభాగంలో డిపాజిట్ చేసి, గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించినట్లు తెలిపారు.