లింగంపేట, అక్టోబర్ 7: ఎల్లారెడ్డి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని ఆయా గ్రామాల్లో పోడు భూముల సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఎల్లారెడ్డి, లింగంపేట మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, అటవీ శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా సర్వే నిర్వహించాలని సూచించారు. అటవీ భూముల్లో పంటలు పండిస్తూ.. కాస్తులో ఉన్నవారు పట్టాలు పొందేందుకు అర్హులని సూచించారు. రైతులు సాగు చేస్తున్న భూములు అటవీ శాఖకు చెందినవా..? రెవెన్యూ శాఖకు చెందినవో గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
నూతనంగా అటవీ భూములు సాగుచేయడానికి ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో ప్రస్తుతం సర్వే నిర్వహించవద్దన్నారు. గ్రామాన్ని తాను సందర్శించిన అనంతరం సర్వే ప్రారంభించాలని సూచించారు. ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని లింగంపేట మం డలంలో 2,694, ఎల్లారెడ్డి మండలంలో 777, తాడ్వాయి మండలంలో 10, నాగిరెడ్డిపేట మండలంలో 40, నిజాంసాగర్ మండలంలోని హసన్పల్లి గ్రామం నుంచి 52 దరఖాస్తులు వచ్చినట్లు రేంజ్ అధికారి ఓంకార్ వివరించారు. సమావేశం లో తహసీల్దార్ మారుతి, ఎంపీడీవో నారాయణ, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి ఎంపీవోలు ప్రభాకర్ చారి, ప్రకాశ్, గిర్దావర్ బాలయ్య, అటవీ శాఖ సెక్షన్ అధికారి సలీం, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.