నస్రుల్లాబాద్, నవంబర్ 19: బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఆలోచనపరులు.. ఎవరు మంచి చేస్తారో, ఎవరు చెడు చేస్తారో ఆలోచించగలరని, మంచి పనులు చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి తండా, రాములగుట్టతండా, మిర్జాపూర్, మైలారం, బొప్పాస్పల్లి తండా, లింగంపల్లి తండా, నస్రుల్లాబాద్, బొమ్మన్దేవ్పల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. రాములగుట్ట జగదాంబ సేవాలాల్ మందిరంలో పూజలు చేశారు. అనంతరం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ తాను మొదటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బంజారాలు వ్యవసాయం చేసేందుకు అవసరమైన సహకారం అందించినట్లు గుర్తుచేశారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లను ఏటా రూ.500 చొప్పున పెంచుతూ రూ.5016 అందిస్తామన్నారు. దివ్యాంగులకు రూ.6016కు పెంచుతామని, పింఛన్ రాని, తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3వేలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైన ఏకైక నియోజకవర్గం బాన్సువాడనేనని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే.. దమ్మున్న, సమర్థుడైన, పరిపాలనాదక్షుడైన కేసీఆర్లాంటి వ్యక్తి సీఎంగా ఉండాలన్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన తొమ్మిది మందిలో ఏనుగు రవీందర్ రెడ్డి ఒక్కరే ఓడిపోయాడన్నారు. సొంత నియోజకవర్గంలో రోడ్లు వేయలేదు, ఇండ్లు కట్టించలేదు, ఏ పనీ చేయలేదని, పనిచేసే మొహంలేక ఓడిపోయారని విమర్శించారు. మంచి పనులు చేయకపోవడంతోనే అక్కడి ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. ఎల్లారెడ్డిలో చెల్లని రూపాయి బాన్సువాడలో చెల్లుతుందా ప్రజలు ఆలోచించాలన్నారు. బాన్సువాడ ప్రజలు మోసం చేసే వాళ్లను బండకేసి కొడతారని, తాను అన్ని విధాలుగా ప్రజలకు మంచి చేశానని, ఏనాడూ మోసం చేయలేదని తెలిపారు. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని భరోసా ఇచ్చారు.ఈ నెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పీటీసీ జన్నూబాయి, సర్పంచులు గోపాల్, యశోద, పురం లక్ష్మి, హన్సీబాయి, మంజూల, విండో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.