కోటగిరి, ఆగస్టు 18: ఆరోగ్యవంతమైన సమాజమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు ముర్రుపాలు పట్టించాలని, తల్లి పాలు అమృతంతో సమానమని పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లి లేనిదే జన్మలేదన్నారు. సమాజంలో మహిళలే ప్రధానమని పేర్కొన్నారు. సృష్టికర్త మహిళ అని, మహిళలు లేకపోతే ప్రపంచమే లేదన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పేద మహిళలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్డుతో భో జనం అందిస్తున్నారని చెప్పారు. రోగాలు వచ్చిన తర్వాత చికిత్స కన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు దవాఖానలు పేదల జేబులు ఖాళీ చేస్తున్నాయని అన్నారు. రోగ రహిత సమాజం రావాలన్నారు. కార్యక్రమంలో సూదం లక్ష్మి, బోధన్ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా, జడ్పీటీసీ శంకర్పటేల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.