బాన్సువాడ/కోటగిరి, అక్టోబర్ 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కొనియాడారు. బాన్సువాడ పట్టణం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమన్నారు. బాన్సువాడలో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువయ్యారని, పనిచేసే వారిపై నిందలు వేస్తున్నారని స్పీకర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ సహకారంతో 10వేల కోట్లతో అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అన్నారు. చేతకాని ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఒకరికి ఓటేస్తే ముగ్గురు ఎమ్మెల్యేలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. కానీ వాస్తవంగా ప్రజలు ఒక్కరికి ఓటు వేసి గెలిపిస్తే ముగ్గురం కూలీలుగా సేవలందిస్తున్నామన్నారు. రాను న్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే రెట్టింపు ఉత్సాహంతో సేవలు అందిస్తానన్నారు. నియోజకవర్గంలో 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశానని ఇందులో 10వేలకు పైగా గృహ ప్రవేశాలు జరిగాయన్నారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని, సాగు నీటి కొరత లేకుండా చేశాన్నారు. కేసీఆర్ ప్రత్యేక సహకారంతో మల్లన్న సాగర్ కాలువ నుంచి నిజాంసాగర్కు సాగునీరు తెచ్చేందుకు రూ.1500 కోట్లు నిధులు మంజూరు చేయడంతో నిజాంసాగర్ నిండు కుండలా మారి రైతాంగానికి రెండు పంటలకు సాగునీరందుతుందన్నారు. తన జీవితంలో ఎంతో మంది నాయకులను, ముఖ్యమంత్రులను చూశానని పేదలు, రైతుల కోసం అనునిత్యం పనిచేసే సీఎం కేసీఆర్లాంటి వ్యక్తిని ఒక్కరినే చూశానని అన్నారు. నియోజకవర్గాన్ని ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి చేశానంటే సీఎం కేసీఆర్ దయతోనేనని ప్రజలు అడిగిన ప్రతి పనులు చేసి పెట్టానని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల పక్షాన కేసీఆర్కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా బాన్సువాడ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేక సహకారంతో అభివృద్ధి చేశారని, రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు పోచారం సీనన్నను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.