కోటగిరి, జనవరి 27: వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామం వద్ద రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని, ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దని సూచించారు. నిర్మాణ పనులకు మొరం అవసరం ఉందని, పరిసర ప్రాంతాల్లో అనువైన మొరం దొరకడం లేదని ఈ సందర్భంగా అధికారులు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో కామారెడ్డి జిల్లా గాంధారి తదితర ప్రాంతాలతోపాటు, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ సర్పంచులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి మొరం తరలించేందుకు ప్రాజెక్టు అధికారులకు సహకరించాలని సూచించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ ఇక్కడి ప్రాంత గిరిజనులకు వరమని అన్నారు. స్పీకర్ వెంట వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, జాకోర సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దశరథ్, బాల్సింగ్, గాజీరాం తదితరులు ఉన్నారు.