నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన బ్యాంకు మొండి బకాయిల రికవరీపై బ్యాంకు సీఈఓ, జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ పరిధిలోని బ్యాంకుల మొండిబకాయిల వివరాలు బ్రాంచీల వారీగా అడిగి తెలుసుకున్నారు.
రుణాల రికవరీ పట్ల బ్యాంకు సిబ్బంది తీరుపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మొండి బకాయిలపట్ల కఠినంగా వ్యవహరించాలని రికవరీకి పాలకవర్గం పూర్తిగా సహకరిస్తుందని తెలియజేసారు. ఇకపై ఏ రోజు ఎంత రికవరీ అయిందో రోజువారీ నివేదికను అందించాలని సీఈఓను ఆదేశించారు. రికవరీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 3నెలల పాటు సస్పెన్షన్ చేస్తానని, అయినా పద్ధతి మార్చుకోకుంటే శాశ్వతంగా ఇంటికి పంపుతామని హెచ్చరించారు.
ఇచ్చిన బాకీలను సకాలంలో వసూలు చేయకపోవడంతో రోజురోజుకు పాతబకాయిలు పెరిగిపోతున్నాయని, ఇది ఇలాగే కొనసాగితే బ్యాంకు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అప్పుడు నష్టపోయేది రైతులు, సిబ్బంది అని, కావున అందరూ రుణాలను సకాలంలో వసూలు చేయాలని తెలిపారు.
బ్యాంకులకు వచ్చే సొసైటీ చైర్మన్లు, రైతులు, ఖాతాదారులకు మర్యాద ఇవ్వాలన్నారు. వారిపట్ల స్నేహపూర్వకంగా మసలుకోవాలని సూచించారు. త్వరలోనే బదిలీలు ఉంటాయని ఏ బ్రాంచికి పంపితే అక్కడే పనిచేయాలన్నారు. పాలకవర్గానికి సిబ్బంది సహకరించాలని, రుణాల రికవరీ విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న తనను సంప్రదించాలని సూచించారు.
సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డైరెక్టర్లు గిర్ధవర్ గంగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కిష్టగౌడ్, శేఖర్ రెడ్డి, సంగ్రామ్, సాయిరెడ్డి, రాంపాటేల్, సాయికుమార్, సిద్దిరాములు,శరత్,భూమయ్య, లింగయ్య, ఆనంద్,మోతిలాల్, శంకర్, భూషణ్ రెడ్డి, బ్యాంకు సీఈఓ గజానంద్, జనరల్ మేనేజర్లు లింబాద్రి, అనుపమ, సుమమాల, తదితరులు పాల్గొన్నారు.