మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. వాటరింగ్ డే సందర్భంగా శుక్రవారం జిల్లాలోని పలు గ్రామాల్లో హరితహారం మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాటిన మొక్కలకు నీళ్లు పోసి సంరక్షించాలని సూచించారు.
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 16: మొక్కలను రక్షించాలని ఎంపీపీ రాజ్దాస్ అన్నారు. వాటరింగ్ డే సందర్భంగా జడ్పీటీసీ మనోహర్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్తో కలిసి మండలంలోని పోచారం గ్రామంలో హరితహారం మొక్కలకు నీళ్లు పోశారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
రామారెడ్డి, డిసెంబర్ 16: మండలంలోని పోసానిపేట్ గ్రామాన్ని డీపీవో శ్రీనివాస్రావు సందర్శించారు. వాటరింగ్ డే సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పట్టారు. నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి మౌనికకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఆయనతోపాటు ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి, ఎంపీవో సవితారెడ్డి, సర్పంచ్ మహేందర్రెడ్డి, ఏపీవో ధర్మారెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.
తాడ్వాయి, డిసెంబర్ 16: మండలంలోని బ్రహ్మాజివాడి, తాడ్వాయి, ఎర్రాపహాడ్ గ్రామాల్లో వాటరింగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలకు నీరు పోశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హరితహారంలో నాటిన మొక్కలకు ప్రతి శుక్రవారం నీరు పోసి, మొక్కల చుట్టూ రక్షణకు కంచెలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న మొక్కలతోపాటు, తాడ్వాయి, ఎర్రాపహాడ్ గ్రామ శివారులో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కలకు నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్వీర్, ఎంపీవో హప్సీబా, సర్పంచులు జ్యోతి, సంజీవు, నర్సారెడ్డి, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 16: మండలంలోని మాచాపూర్ గ్రామపంచాయతీని ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కోతుల ఆహారశాలను పరిశీలించిన ఆయన అక్కడ మొక్కలకు నీళ్లు పోశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడుతూ.. మొక్కల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. పాదులు తీసి నీళ్లు ఆగేలా చూడాలన్నారు. అనంతరం నర్సరీలో చేపడుతున్న భూమి చదును చేసే పనులను పరిశీలించారు. బ్యాగుల్లో నాణ్యమైన మట్టిని నింపాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం తగదన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రమేశ్ ఉన్నారు.