నిజామాబాద్ క్రైం, జూన్ 1 : నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. వన్టౌన్, 5వ టౌన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు మారణాయుధాలతో తిరుగుతూ ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ తగాదాల్లో తలదూరుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. గురువారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో నగరానికి చెందిన పాత నేరస్తుడు, రౌడీషీటర్ అయిన డాన్ ఆరిఫ్ దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్ ఏరియాలో జరిగిన రౌడీషీటర్ ఇబ్రహీం చావూస్ అలియాస్ జంగల్ ఇబ్బు(30)ను ప్రత్యర్థి అయిన రౌడీషీటర్ ఆరిఫ్ డాన్ తన అనుచరులతో కలిసి హత్య చేశాడు. నగరంలోని బాబన్ సాహాబ్ పహాడ్ ప్రాంతానికి చెందిన మృతుడు జంగల్ ఇబ్బుకు సైతం నేరచరిత్ర ఉంది. 14 నెలల క్రితం ఆరో టౌన్ పరిధిలోని ఓ హోటల్ వద్ద తన అనుచరులతో కలిసి కొంతమంది పై దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై అప్పటి సీపీ నాగరాజు సీరియస్గా పరిగణించారు. దీంతో మృతుడు ఇబ్బుతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అయినప్పటికీ ఇబ్బులో మార్పు రాకపోవడంతో పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు తరలించారు. జంగిల్ ఇబ్బు ప్రత్యర్థి అయిన రౌడీషీటర్ డాన్ ఆరిఫ్ల మధ్య ఏడాది కాలం నుంచి ల్యాండ్ సెటిల్ మెంట్లకు సంబంధించిన గొడవలు ఉన్నాయి. ఇబ్బును అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి జనవరి ఒకటో తేదీన ఆరిఫ్ బంధువు ఒకరు దగ్గరుండి ఇబ్బును మర్డర్ చేయించినట్లు సమాచారం.
పోలీస్ బాస్ ఆదేశాలు బేఖాతరు
అప్పటి సీపీ కె.ఆర్.నాగరాజు రౌడీషీట్లు ఓపెన్ చేయించడంతో పాటు తీరుమారని పాత నేరస్తులపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేయించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి వివరాలు సేకరించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ఎప్పటికప్పుడు సిబ్బందిని ఆదేశించారు. అయినప్పటికీ పలువురు సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో రౌడీషీటర్లు మళ్లీ రెచ్చిపోతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. రెండు గ్యాంగుల అరాచకాలకు బలైన చాలా మంది ఫిర్యాదు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని మిన్నకుండిపోతున్నారు.
మారణాయుధాలపై నియాంత్రణ ఏదీ?
పాత నేరస్తులు, గ్యాంగ్లు మెయింటైన్ చేసే వారు సెటిల్మెంట్లు చేస్తున్న వారు మారణాయుధాలు కలిగి ఉంటున్నారనే విషయం సంబంధిత పోలీస్ స్టేషన్లో సిబ్బందికి సమాచారం లేకుండా ఎందుకు ఉండదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత పోలీసులకు పాతనేరస్తులపై నిఘా లేకపోవడంతో వారు మారణాయుధాలతో రెచ్చిపోతున్నారనే ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క పక్క పోలీస్ బాస్ నేరాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించిన సమాచారం సేకరించి ఆయనకు చేరవేడంలో సంబంధిత పోలీస్ స్టేషన్ల సిబ్బంది విఫలమైనట్లు స్పష్టం అవుతున్నది.