మోర్తాడ్/కామారెడ్డి, ఏప్రిల్ 28: ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా ఇంధన కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా రెండు మూడు రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.దీంతో వినియోగదారులు ఇంధన కొరత లేని బంకుల్లో బారులు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. నెల రోజుల క్రితం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఇంధన కొరత ఉండేది. ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలో సద్దుమణిగింది. ఇప్పుడు కేంద్రం పెట్రో ధరలను పెంచుతున్నదనే ప్రచారం జరగడంతో మళ్లీ ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు ఉంచడంతో వాహనదారులు క్యూలు కట్టి ఫుల్లుగా పోయించుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద మంగళవారం నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం గమనార్హం. కొందరు బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ను తీసుకెళ్తున్నారు.
యాసంగి సీజన్ ముగియడంతో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో డీజిల్ కొరత ఏర్పడడం ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా వరి కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ ఎక్కువగా ఉన్నది. దీంతో డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డీజిల్ కొరత కారణంగా వరికోత యంత్రాల యజమానులు ధరలు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు వానాకాలం పంటలకు దుక్కిదున్నే పనులు, సేంద్రియ ఎరువులు, చెరువుల మట్టి తరలింపు తదితర పనుల్లో ట్రాక్టర్లు బిజీబిజీగా ఉంటున్నాయి. ఈనేపథ్యంలో డీజిల్ కొరత వల్ల చాలా వరకు పనుల్లో ఆటంకం కలుగుతున్నది. కమ్మర్పల్లిలో రెండురోజుల పాటు డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ప్యాసెంజర్ ఆటోలు నడిపేవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీజిల్ రాగానే పెట్రోల్ బంక్ యజమానులు వాట్సాప్ గ్రూపుల్లో డీజిల్ వచ్చిందని మెస్సేజ్లు చేయడంతో వాహన దారులు బారులు తీరారు. క్యాన్లలో సైతం డీజిల్ను తీసుకెళ్తున్నారు.