వినాయక్నగర్, జనవరి 16: పతంగులు ఎగురవేయడానికి ఉపయోగించిన చైనామాంజాతో ఒకరికి గాయాలైన ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకున్నది. నాల్గో టౌన్ పరిధిలోని గాయత్రీనగర్కు చెందిన ఓ వ్యక్తి సోమవారం తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్థానిక చైతన్య పబ్లిక్ స్కూల్ వద్ద ఆయన మెడకు ఒక్కసారిగా చైనా మాంజా వచ్చి తగలడంతో అతని మెడకు గాయమైంది. మెడకు చుట్టుకున్న చైనామాంజాను చేతితో తొలగించే క్రమంలో చేతికి కూడా గాయమైంది. చైనా మాంజా విక్రయంపై నిషేధం ఉన్నప్పటికీ వినియోగించడంతో వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా చైనా మాంజా కారణంగా ప్రాణాలు పోయేవని, తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని బాధితుడు తెలిపారు. చైనా మాంజాను నియంత్రించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయాడు.
పతంగి తీస్తుండగా విద్యుత్ షాక్…యువకుడికి తీవ్రగాయాలు
పతంగి కోసం పరుగులు తీసిన యువకుడికి కరెంటు షాక్తో తీవ్రగాయాలైన ఘటన బాన్సువాడలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ పట్టణానికి చెందిన కరణ్సింగ్(22) ఈ నెల 15న పతంగి ఎగురవేస్తుండగా అది తెగిపోయింది. పతంగి వెళ్లి మిషన్ భగీరథ కార్యాలయ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు చిక్కుకున్నది. దీంతో పతంగిని తీసే క్రమంలో కరణ్సింగ్ అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్పై పడ్డాడు. గమనించిన స్థానిక ఆటో డ్రైవర్లు వెంటనే ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదంలో కరణ్సింగ్కు కరెంటు తీగలు తగిలి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు నిజామాబాద్ దవాఖానకు రిఫర్ చేశారు.