మోదీ సర్కారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. తరచూ ధరల పెంపుతో సామాన్యులను చావబాదుతున్నది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వంటి నిత్యావసరాల రేట్లను ఎడాపెడా పెంచుతూ పేదలపై పెనుభారం మోపుతున్నది. సిలిండర్ ధరను ఇష్టానుసారం పెంచుకుంటూ పోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాజాగా వినియోగదారులపై మరో రూ.50 చొప్పున వడ్డించింది. వంట గ్యాస్ ధరను రెండేండ్లలో రెండింతలు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కింది. 2020 నవంబర్లో రూ.670 ఉన్న సిలిండర్ రీఫిల్ రేటు ఇప్పుడు రూ.1178.50కు చేరుకున్నది. కేంద్ర సర్కారు తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లా ప్రజలపై ‘బండ’డు భారం పడుతున్నది. ప్రతి నెలా రూ.2.25 కోట్ల చొప్పున, ఏటా రూ.27 కోట్లకు పైగా అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికే ధరాఘాతంతో సతమతమవుతున్న సామాన్యులు.. కేంద్రం తీరుపై మండి పడుతున్నారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ‘అచ్చే దిన్’ రాలేదు కానీ,రేట్ల పెంపుతో జనాలు ఆర్థికంగా చితికి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. శుక్రవారం ఉమ్మడిజిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
నిజామాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది. గతేడాది కాలమంతా పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచేసి జనాన్ని ఆగం చేసిన కేంద్ర సర్కారు.. అడపాదడపా ఎల్పీజీ ధరలను పెంచుతూ వంటింట్లోనూ మంట పెడుతున్నది. అచ్చే దిన్ అంటూ ప్రసంగాలిచ్చే బీజేపీ నాయకులకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎల్పీజీ సిలిండర్పై రూ.50 పెంపుతో రూ.1128.50 ఉన్న ధర కాస్త గురువారం నుంచి రూ.1178.50 చేరింది. ఇంచుమించు రూ.1200 గ్యాస్ సిలిండర్ ధరను తీసుకొచ్చి న ఘనతను ప్రధాని మోదీ సర్కారుకే చెల్లింది.
భారం ఇంతింత కాదయా…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 42 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 26 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో 3లక్షల 26వేల మంది వినియోగదారులున్నారు. ప్రతి రోజూ సరాసరి 9వేల ఎల్పీజీ సిలిండర్లు వినియోగం అవుతున్నాయి. సరాసరి ఒక నెలలో దాదాపు 2లక్షల 70వేల వంట గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 16 మంది వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీరి పరిధిలో 2లక్షల 10వేల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రతి రోజూ 6వేల ఎల్పీజీ సిలిండర్లు వినియోగం అవుతున్నాయి. ఒక నెలలో దాదాపు లక్షా 65 వేల సిలిండర్లు వినియోగం అవుతున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరతో తీవ్రమైన ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సిలిండర్ వెలిగించాలంటేనే జంకే దుస్థితి ఏర్పడింది.
పెరుగుదల ఇలా…
సామాన్యులను తీవ్రంగా ప్రభావం చూపే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కనీసం మానవత్వాన్ని ప్రదర్శించడం లేదు. ఓ వైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యుడి సంపాదన అంతా వ్యక్తిగత ఖర్చులకే సమాప్తం అవుతున్నాయి. నెలవారీగా సంపాదించే జీతం డబ్బులు నెలలో మొదటి వారానికే ఖతం అవుతున్న దుస్థితి సగటు వేతన జీవికి తలెత్తింది. ఇలాంటి దుస్థితిలో ఉపశమన చర్యలను తీసుకోవాల్సిన కేంద్ర సర్కారు ఏకంగా కుంగదీసే విధంగా చర్యలు తీసుకుంటుండడం విడ్డూరంగా మారుతున్నది. 2020 నవంబర్లో రూ.670 మాత్రమే ఉన్న సిలిండర్ ధర ఇప్పుడేకంగా రూ.1178.50లకు చేరడం కన్నీరు తెప్పిస్తోంది. 2020 ఏడాది ముగింపులో రూ.100 పెంచారు. 2021 ఫిబ్రవరి నెలలో రూ.75, మార్చిలో రూ.50, ఏప్రిల్లో రూ.10 తగ్గింపు, జూలైలో రూ.25.50 పెంపు, ఆగస్టులో రూ.25, సెప్టెంబర్లో రూ.25, అక్టోబర్లో రూ.50 ఇలా ఎడాపెడా రెండేండ్ల క్రితం నుంచి ధరల వాతలను వడ్డిస్తుండడంతో సిలిండర్ ధర వేయి దాటుకుని పన్నెండు వందలకు చేరువైంది. గతేడాదిలో ఏప్రిల్ 22న రూ.50, మే 7న రూ.50 పెరుగుదలతో సిలిండర్ ధర రూ.1075.50కు చేరింది. జూన్లో 50 పెంపుతో రూ.1128కి చేరగా ఇప్పుడేకంగా మరో యాభై రూపాయల భారంతో రూ.1178 చెల్లించుకోవాల్సి వస్తోంది.
కనికరం కరువు…
గడిచిన తొమ్మిదేండ్లుగా బీజేపీ పాలనలో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెట్టడం, సామాన్యుల పొట్ట కొట్టడం అన్న సిద్ధాంతం ప్రకారం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తున్నట్లుగా అవగతం అవుతున్నది. సామాన్యులకు మేలు చేయాల్సిన కేంద్రం అరకొరగా పథకాలను తీసుకువచ్చి మమ అనిపిస్తోంది. సంక్షేమాన్ని గాలికి వదిలేసి, రాయితీ పథకాల్లో కోత పెట్టి ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పాన్ని పూర్తిగా మరిచి పోయింది. ఇక దేశ ప్రజలను భావోద్వేగాల పేరుతో నిత్యం గందరగోళానికి గురి చేయడం తప్ప బీజేపీ పాలకులు చేస్తున్న మంచి పనులంటూ లేకపోవడం విడ్డూరంగా మారింది. ఇందుకు ప్రజల ఓట్లతో గెలిచి నాలుగేండ్లుగా నిజామాబాద్ ప్రజలకు చిల్లి గవ్వ పని చేయని ఎంపీ అర్వింద్ వ్యవహారమే ఇందుకు సాక్షాత్కారంగా నిలుస్తున్నది. ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా నిలువునా పసుపు రైతులను బీజేపీ ముంచేసింది. ఓ వైపు ఇంధన ధరల పేరుతో నడ్డి విరుస్తున్నది. మరోవైపు ఎల్పీజీ ధరలను చీటికిమాటికి పెంచుతూ సామాన్యులపై పెను భారం మోపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నది.
సామాన్య ప్రజలపై భారం తగదు…
డిచ్పల్లి, మార్చి 3: పేద ప్రజల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తీరు సరైనది కాదు. నిత్యావసర, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం వేయడం తగదు. గ్యాస్ పొయ్యి వెలిగించాలంటేనే జంకే పరిస్థితి వచ్చింది.
-గంగూబాయి, సాంపల్లి తండా, డిచ్పల్లి
పేదలు బతుకుడు కష్టమే..
కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారులకు అండగా ఉంటూ సామాన్య ప్రజలపై భారం మోపడం తగదు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కార్పొరేట్ వ్యాపారులను పెంచి పోషిస్తుంది. ఇప్పుడు మళ్లా గ్యాస్ ధర రూ.50 పెంచారు. దీంతో పేదలు బతుకుడు కష్టమే..
-రాధిక, గృహిణి, ఇందల్వాయి
ధరలు ఇట్లా పెంచితే బతుకుడెట్లా..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి గరీబోళ్ల జీవితాలతో ఆటలాడుతున్నది. ఇప్పుడు మళ్లా రూ.50 రూపాయలు పెంచారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు బతుకుడెట్లా.. తక్షణమే సిలిండర్ ధరలను తగ్గించాలి.
-లక్ష్మి, అమృతాపూర్, వడ్డెర కాలనీ
మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ పెరుగుతూనే ఉంది. గతంలో ఇంతపెద్ద ఎత్తున ధరలు పెంచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్పై పెద్ద ఎత్తున ధరలు పెంచిన ప్రభుత్వంగా పేరుగాంచింది.
-జి.గోపాల్, సాంపల్లి