నిజామాబాద్ కల్చరల్/ కామారెడ్డి, నవంబర్ 11: ఉమ్మడి జిల్లా ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదివారం ధనలక్ష్మీ దేవి పూజలను నిర్వహించేందుకు వాణిజ్య సంస్థలు, దుకాణాదారులు, ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. పటాకులు, నోరూరించే మిఠాయిలు, పేనీల అమ్మకాలు జోరందుకున్నాయి. దుకాణాలను విద్యుత్ కాంతులతో వెలిగిపోయేలా ముస్తాబుచేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగకు అవసరమైన వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లతో మార్కెట్ సందడిగా మారింది. పూలు, పూజాసామగ్రి, ఖాతా పుస్తకాలు భారీగా విక్రయిస్తున్నారు. అందరూ అమితానందంగా ఇష్టపడే పేనీలకు డిమాండ్ పెరిగింది.
స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుకోవడం సంప్రదాయం. దీపావళి అంటే దీపాల వరుస. పద్మ, స్కంద పురాణాల్లో దీపావళి గురించిన ప్రస్తావన ఉన్నది. శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళలోకానికి అణగదొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకొంటారని, శ్రీరామచంద్రుడు రావణాసురున్ని వధించి శ్రీసీతా లక్ష్మణ ఆంజనేయాధులతో అయోధ్యకు వచ్చి పట్టాభిషేక్తుడైన రోజుగాను దీపావళి జరుపుకొంటారు. శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడిని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళిని జరుపుకొంటున్నారని కృతా, త్రేతా, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. పంచపాండవులు వనవాస, అజ్ఞాత వాసాలు పూర్తిచేసుకొని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో దీపావళి జరుపుకొంటున్నారని కూడా ప్రచారంలో ఉన్నది. ఆది పరాశక్తి శుంభనిశుంభని రాక్షసులని సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని పెద్దలు చెబుతారు. ఇవే కాక క్షీరసాగర మథనంలో అవతరించిన శ్రీమహాలక్ష్మీదేవి ఉద్భవించిన దినంగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకొంటారు. దీపాలు వెలిగిస్తే సకల దోషాలు తొలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
నరక చతుర్దశి సందర్భంగా ఉదయం మంగళ హారతులు తీసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులకు ఆడపడుచులు మంగళహారతులు ఇచ్చి వీరతిలకం దిద్దడం ఆనవాయితీ. దీపావళి రోజున పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట, వారికి దారి కనిపించడం కోసమే దివ్వెలు పెట్టే సంప్రదాయం ఏర్పడింది. వ్యాపారులు ధనలక్ష్మీదేవిని అవాహనం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు.
ఆదివారం ఉదయం 4 నుంచి 7గంటల వరకు మంగళహారతులు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12గంటల వరకు లక్ష్మీదేవి పూజలు జరుపుకోవడానికి అనువైన సమయాలని అనంత పద్మనాభస్వామి ఆలయ అర్చకుడు రమణాచారి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని కుమార్గల్లీ, రాష్ట్రపతిరోడ్, నెహ్రూపార్కు, హైదరాబాద్రోడ్, ఎల్లమ్మగుట్ట, వినాయక్నగర్, వర్నిచౌరస్తా, సుభాష్నగర్, దుబ్బ, కంఠేశ్వర్ తదితర ప్రాంతాల్లో దీపావళి పూజకు అవసరమయ్యే సామగ్రి క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అరటి, మామిడికొమ్మలు, లక్ష్మీదేవి ప్రతిమలు, ప్రమిదలు, వరిపేలాలు తదితర అమ్మకాలు నిర్వహిస్తున్నారు.