రైతులు, దళితుల పట్ల కాంగ్రెస్ అనుచిత వైఖరి మరోసారి బహిర్గతమైంది. రైతుబంధు, దళితబంధును ఆపేయాలని హస్తం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ తీరుపై జనాగ్రహం వెల్లువెత్తింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నిరసనలు మిన్నంటాయి. రైతాంగానికి ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం చేస్తుంటే ఓర్వలేనితనంపై ప్రజలు మండిపడ్డారు. దళితబంధు కూడా ఆపేసి దళితుల పొట్ట కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్, ఉత్తమ్ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని రైతులు, దళితులు హెచ్చరించారు.
డిచ్పల్లి/ ఇందల్వాయి/మోపాల్ (ఖలీల్వాడి), అక్టోబర్ 26 : రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పంట సాయం పెట్టుబడి అందజేస్తుంటే.. ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధును నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు గురువారం దహనం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో సీనియర్ నాయకుడు శక్కరికొండ కృష్ణ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగదాస్ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజల పరిస్థితి అధ్వానంగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, రూరల్ ఎస్సీ కన్వీనర్ పాశంకుమార్, మండల ఉపాధ్యక్షులు బీరీశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.