కామారెడ్డి, మే 21 (నమస్తే తెలంగాణ)/ ఖలీల్వాడి : వానకాలం వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మంచి దిగుబడులు సాధించాలంటే విత్తనాలే మూలాధారం.. నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలపై అధికారులు దృష్టి సారించారు. అన్ని మండలాల పరిధిలో విత్తన దుకాణాలను తనిఖీ చేయడంతోపాటు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటున్నారు. బృందంలో వ్యవసాయ శాఖతోపాటు పోలీసు, రెవెన్యూ అధికారులు సభ్యులుగా ఉన్నారు.రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు.ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోకి నకిలీ విత్తనాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నారు.
నకి లీ విత్తనాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. నకిలీ విత్తనాలు అమ్మితే ఆ కంపెనీల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసేందుకు సైతం సిద్ధమయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నకిలీ విత్తనాలపై సీరియస్గా స్పందించాలని ఆదేశించారు.అలాగే రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండు రోజులు గా ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు ఉన్నాయి. ఈ రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలను తీసుకువచ్చి మారుమూల గ్రామాల్లో విక్రయిస్తుంటారు. కామారెడ్డి జిల్లాలో వానకాలంలో వరి 2.61లక్షల ఎకరాల్లో, జొన్న 17వేల ఎకరాల్లో, మక్కజొన్న 35వేల ఎకరాల్లో, శనగ 87వేల ఎకరాల్లో, పత్తి 40 వేల ఎకరాల్లో, పొద్దుతిరుగుడు 2వేల ఎకరాల్లో సాగు చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానకాలం 5 లక్షల 13 వేల ఎకరాల్లో వానకాలం పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4.18 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా.
అయితే సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కువగా నకిలీ పత్తి, జొన్న, శనగ, సోయా, మక్కజొన్న విత్తనాలు తీసుకువస్తారు. నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతూ, వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రేయింబవళ్లు కష్టపడుతూ, వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి, చివరకు చేతికి ఏమీ రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర సర్కారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది కాలంగా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న వారిపై 986 కేసులు, 58 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి 1938 మందిని అరెస్టు చేశారు.
ఉమ్మడి జిల్లాలో పది టాస్క్ఫోర్స్ బృందాలు
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ఉమ్మడి జిల్లాలో పది టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో వ్యవసాయ శాఖతో పాటు పోలీసు, రెవెన్యూ అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి, పక్క రాష్ర్టాల నుంచి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి పెట్టి పకడ్బందీగా నియంత్రించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. అలాగే పోలీసులు గ్రామాల్లో కళాజాత నిర్వహించి రైతులను చైతన్యవంతులు చేయనున్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతూ, ఇతర రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పెంచనున్నారు. ఇటీవల ఉభయ జిల్లాల కలెక్టర్లు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించారు. విత్తన దుకాణాల్లో తప్పనిసరిగా లైసెన్స్ను ప్రదర్శించాలని, విత్తనాల విక్రయ బిల్లు పూర్తి వివరాలతో అందించాలని, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ, ఫారం డీ సమర్పణ, లైసెన్స్ రెన్యువల్ చేయడం, షాపు మార్పు వివరాలు లైసెన్స్లో నమోదు వంటి అంశాలపై అధికారులు విత్తన డీలర్లు, వ్యాపారులకు సమాచారం అందించి సవరించేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో ఆకస్మిక తనిఖీల సమయంలో గడువు తేదీ ముగిసిన విత్తనాలు అమ్మడం, లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపట్టడం, హెచ్టీ పత్తి విత్తనాల అమ్మకం, లైసెన్స్ లేకుండా ఇతరులకు అందించి విక్రయాలు చేపట్టడం, నకిలీ విత్తనాలు ఉండడం వంటి అంశాలపై కఠినంగా వ్యవహరించనున్నారు. జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, టాస్క్ఫోర్స్ బృందాలు క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటూ నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు చేపట్టారు.
జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టాం
జిల్లాలో నకిలీ విత్తనాలను దాదాపు అరికట్టాం. ముఖ్యంగా నకిలీ విత్తనాలు పత్తి, మిర్చికి సంబంధించి అధికంగా ఉంటాయి. మన జిల్లాలో మిర్చి పంట సాగు చేయరు. పత్తి విత్తనాలను అరికట్టేందుకు నాలుగు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు నిత్యం పర్యవేక్షిస్తుంటాయి. మండలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకొని భద్రపర్చుకోవాలి.
–వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి
ప్రత్యేక బృందాలతో తనిఖీలు
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నిర్ణయాల మేరకు విస్తృతంగా తనిఖీలు చేప ట్టాం. ఈ నెలాఖరు వరకు తనిఖీలు కొనసాగుతాయి. జిల్లాలో నకిలీ విత్తనాల బెడద లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిబంధనలను ఉల్లంఘించి విత్తన అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం.
–తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, నిజామాబాద్