నిజామాబాద్, మార్చి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ పేర్లను ఖరారు చేశారు. నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి గోవర్ధన్ పరిచయం అక్కర్లేని వ్యక్తి. నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, జగిత్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనూ బాజిరెడ్డికి పట్టున్నది. గతంలోనూ ఆర్మూర్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి 2014, 2018లో వరుసగా విజయం సాధించారు. ఆర్టీసీ చైర్మన్గా పనిచేసి సంస్థకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. మాస్లీడర్గా, ప్రజల నాయకుడిగా గుర్తింపు పొందిన బాజిరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయింపుతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉండే జహీరాబాద్ నియోజకవర్గానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గాలి అనిల్ కుమార్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి పలు ఎన్నికల్లో గాలి అనిల్కుమార్ పోటీ చేయడం ద్వారా స్థానిక ప్రజానీకానికి సుపరిచితమే.
బడుగు, బలహీనవర్గాలకు కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఎంతో కృషి చేసింది. ప్రభుత్వంలో, పార్టీలో ఎంతో ప్రాముఖ్యతను అందించి విలువైన పథకాలను తీసుకువచ్చింది. రాజకీయ అవకాశాలను కల్పించడంతోపాటు ఆయా వర్గాల వారిని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలను కట్టబెట్టినట్లే లోక్సభ పోరులోనూ అదే ఒరవడిని కేసీఆర్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు ఖరారైన అభ్యర్థులు ఇరువురు బీసీ వర్గానికి చెందిన వారు కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
బలహీనవర్గాలకు చెందిన వారికి రాజకీయ అవకాశాలను కల్పిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలు జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలుస్తుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంతా ఉలిక్కి పడాల్సి వస్తోంది. ఇప్పటికే నిజామాబాద్కు బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పేరు ఖరారైంది. జహీరాబాద్కు బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బీబీపాటిల్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి జహీరాబాద్కు సురేశ్ షెట్కార్ పేరును ఖరారు చేసింది.
నిజామాబాద్కు ఇంకా అభ్యర్థుల వెతుకులాటలోనే మునిగి తేలుతోంది. బీజేపీకి అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్కు చెందిన కీలకనేతలను లాక్కొని కండువా కప్పి టికెట్లు ఇచ్చే దౌర్భాగ్యం ఉండగా కాంగ్రెస్కు సరైన లీడర్లే దొరకడం లేదు. ఇప్పుడీ పరిస్థితిలో బలమైన బీసీ వర్గానికి చెందిన లీడర్లను పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నిలబెడుతుండడంతో నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో చర్చనీయాంశమైంది. గెలుపు అవకాశాలు మెండు గా ఉండడంతో గులాబీ సైన్యం సంపూర్ణ సమన్వయంతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నది.