కామారెడ్డి/ఖలీల్వాడి, మే 24 : ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసిందని కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ విజయ్కుమార్, నిజామాబాద్ ప్రభుత్వ సాంకేతిక కళాశాల జిల్లా సమన్వయ కర్త ఫణిరాజ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు కేంద్రాల్లో మొత్తం 2,301 మంది విద్యార్థులకు 2134 మంది పరీక్షకు హాజరైనట్లు పాలిసెట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ విజయ్కుమార్ పేర్కొన్నారు. ఇందులో బాలికలు 1175, బాలురు 1126 మంది ఉన్నారని తెలిపారు. సాందీపని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ప్రత్యేక పరిశీలకులు భరత్ కుమార్, హరికృష్ణ, ప్రత్యేక స్వాడ్ బృందం సభ్యులు బలరాం, గోపాల్, ఆంజనేయులు తనిఖీ చేశారు. కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించినట్లు వివరించారు. నిజామాబాద్లో మొత్తం 5,586 మంది విద్యార్థులకు 4,961 మంది పరీక్షకు హాజరైనట్లు ప్రభుత్వ సాంకేతిక కళాశాల జిల్లా సమన్వయ కర్త ఫణిరాజ్ తెలిపారు. ఇందులో బాలురు 2,559, బాలికలు 2402 మంది ఉన్నారని పేర్కొన్నారు. పాలిసెట్కు మొత్తం 88.81శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.