కాంట్రాక్ట్ కొలువులతో కష్టాలు పడుతున్న జీవితాలకు ‘పర్మినెంట్’ ఆనందం వచ్చింది. క్రమబద్ధీకరణతో రాష్ట్ర ప్రభుత్వం వేలాది కుటుంబాలకు వెలుగునిచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ర్టానికి మకుటంలా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవం రోజునే ఒప్పంద ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో వందలాది మందికి ప్రయోజనం చేకూరనున్నది. రెగ్యులరైజ్ చేయడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులకు కొత్త వెలుగులు అందించిన ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు.
నిజామాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీమాంధ్ర పాలనలో నాటి పాలకుల అసమర్థతతో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. అరకొర జీతాలతో వెట్టిచాకిరి విధానంగా కాం ట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను మార్చి సమైక్య పాలకులు చేసిన పాపాలు అనేకం. వారికి చాలీచాలని జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు చేసిన విన్నపాలు, పోరాటాలను నాటి పాలకులు పట్టించుకోలేదు. కానీ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ నిజంగా ప్రజా పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ రాష్ర్టానికి మకుటంలా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవం రోజునే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఎన్నో ఏండ్లుగా కండ్లల్లో వొత్తులు వేసుకొని బతుకుతున్న వారందరికీ ఎట్టకేలకు న్యాయం చేకూరింది. కామారెడ్డి జిల్లాలో దాదాపు 204 మందికి, నిజామాబాద్ జిల్లాలో 308 మందికి సాంత్వన చేకూరబోతున్నది.ఇందులో జూనియర్, డిగ్రీ లెక్చరర్లే అత్యధికంగా ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇక రెగ్యులర్ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టారు.
నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ…
ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి ఏడాది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం జీవో నెంబర్ 16ను జారీ చేస్తే విపక్షాలు మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబించాయి. కోర్టులో కేసులు వేసి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఏనాడైనా కేసీఆర్ మాత్రమే మాకు న్యాయం చేస్తారనే ధీమాతో కాంట్రాక్టు ఉద్యోగులు కాలం గడుపుతూ వచ్చారు. కుటిల రాజకీయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరును ఎండగడుతూ వచ్చారు. వీరి నమ్మకానికి అనుగుణంగానే రెగ్యులర్, కాంట్రాక్టు అనే తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ 2017లో కేసీఆర్ ప్రభుత్వం వేతనాలను అమలు చేసింది. 2021లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పీఆర్సీ వర్తించేలా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించి అమలు చేశారు. 2022 మార్చి నెలలో అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేయడం ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడుగులు వేగంగా పడ్డా యి. ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాల ద్వారా సబ్బండ వర్ణాలకు న్యాయం చేసిన కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నెరవేరుతున్న ఉద్యమ ఆకాంక్ష…
రాష్ట్ర కల సాకారం అయ్యాక సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలను ఒక్కోటిగా నెరవేరుస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్కు అనుగుణంగా నిర్ణయాలు వెలువరుస్తున్నారు. ఇప్పటికే లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను చేపట్టారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సుమారుగా 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణకు నోచుకోబోతున్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు 42 మంది, జూనియర్ లెక్చరర్లు 180 మంది వరకు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు 30 మంది, జూనియర్ లెక్చరర్లు 130 మంది ఉన్నట్లుగా సమాచారం. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో 18 మంది ఉన్నారు. వీరితో పాటుగా ఇతర శాఖల్లోనూ పలువురికి రెగ్యులర్ హోదా దక్కనున్నది. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని వారంతా ప్రకటిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులంతా కేసీఆర్కు పాలాభిషేకాలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
స్థానికులకే పెద్దపీట…
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటుగా సీఎం కేసీఆర్ భారీ ఎత్తులో ఉద్యోగ నియామకాలను చేపడుతున్నారు. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న అనేక శాఖల్లోని ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తున్నారు. స్వతంత్ర నియామక సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు జారీ కాగా ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. జోనల్, మల్టీ జోనల్ మార్పులు ఆధారంగా 95శాతం స్థాని క యువతకే ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. రాష్ట్రపతి చేత ఆమోద ముద్ర వేయించిన తర్వాతనే నియామకాలను చేపట్టడం ద్వారా స్థానికులకు పెద్దపీట దక్కుతున్నది. తెలంగాణ యువతకు 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి తెచ్చారు. కేవలం 5శాతం మాత్రమే ఓపెన్ కోటా పెట్టారు. అందులోనూ మనవాళ్లకే 3శాతం ఉద్యోగాలు వస్తాయి. అంటే మొత్తం వందలో 98శాతం మన ఉద్యోగాలు మనకే దక్కుతాయి. ప్రస్తుతం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 91వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.
కాంట్రాక్టు ఉద్యోగులు బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని సన్మానించారు. సర్వీసు రెగ్యులరైజ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.