డిచ్పల్లి, జూన్ 14 : టీయూలో కొన్నిరోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందలేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అందరు కలిసి వీసీ రవీందర్ను బుధవారం ఘెరావ్ చేశారు. బుధవారం ఈసీ సమావేశం ఉందని తెలుసుకొని అవుట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వందలసంఖ్యలో పరిపాలనా భవనం వద్దకు చేరకొని వీసీని అడ్డుకున్నారు. ఎండలోనే కూర్చోబెట్టి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి సమస్యలను పరిష్కరిస్తానని వీసీ చెప్పడంతో ఆయనను పరిపాలనా భవనానికి వెళ్లేందుకు అనుమతించారు. తన చాంబర్కు తాళం ఉండడంతో వీసీ.. ఎస్బీఐలోనే కూర్చున్నారు.
తన సంతకం ఎందుకు చెల్లందటూ బ్యాంకు మేనేజర్తో రిజిస్ట్రార్ కనకయ్య వాగ్వాదానికి దిగారు. అప్పటికే నిజామాబాద్ నుంచి ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ వర్సిటీకి చేరుకొని రిజిస్ట్రార్, వీసీతో సమావేశమయ్యారు. చెక్కు క్లియర్ కావాలంటే పాలకమండలి నియమించిన యాదగిరే రిజిస్ట్రార్గా కొనసాగేలా వీసీ సంతకం చేయాలని లేదా వీసీ నియమించిన కనకయ్యకు పాలకమండలి సభ్యులు అనుమతించాలని, అప్పుడే చెక్కులు చెల్లుతాయని స్పష్టం చేశారు. హైకోర్టులో వీసీ వేసిన కేసును వాపసు తీసుకున్నా సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
పూలకుండీల ధ్వంసం..
వివాదాలతో వర్సిటీ పరువు పోతున్నదని, రిజిస్ట్రార్గా ఎవరినో ఒక్కరిని నియమించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పరిపాలనా భవనం మెట్లపై ఉన్న పూలకుండీలను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా వంట చేయకపోవడంతో పస్తులుంటున్నామని, వీసీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకౌంట్ సెక్షన్ తాళాన్ని ధ్వంసం చేసే యత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు.
ఈసీ సమావేశానికి రావాలని సభ్యులకు ఫోన్..
పాలకమండలి సమావేశానికి ఏడు రోజుల ముందుగానే ఆహ్వానం పంపాల్సి ఉంటుంది. కానీ వీసీ తన సెల్ఫోన్ నుంచి ఒక్కరోజు ముందే రాత్రి 8గంటలకు మెస్సేజ్ పెట్టి, ఉదయం సమావేశానికి రావాలని పేర్కొనడంతో ఏ ఒక్క సభ్యుడూ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో వీసీ.. రిజిస్ట్రార్ కనకయ్యతో సభ్యులకు ఫోన్ చేయించారు. వివిధ కారణాలతో రాలేకపోయామని సభ్యులు సమాధానం చెప్పడంతో చేసేది ఏమీ లేక వీసీ మిన్నకుండిపోయారు.
‘కాళ్లు మొక్కుతాం.. మా డబ్బులు మాకు ఇవ్వండి’…
టీయూ పరిధిలోని భిక్కనూరు సౌత్ క్యాంపస్లో దినసరి వేతన సిబ్బందిగా చేరిన 15 మంది వీసీని అడ్డుకున్నారు. నియామక సమయంలో ఇచ్చిన డబ్బులు, వేతనాలు ఇవ్వాలని వీసీ రవీందర్ గుప్తా కాళ్లు పట్టుకున్నారు. రెండు రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తామని వీసీ హామీ ఇచ్చినప్పటికీ.. బాండ్ పేపర్ రాసి ఇవ్వాలని పట్టుబట్టారు.