బీర్కూర్, జూలై 19: ఓడలు బండ్లవుతాయ్…బండ్లు ఓడలవుతాయ్ అన్న నానుడిని నిజం చేస్తున్నాయ్ నేడు మనం చూస్తున్న చిత్రాలు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంటలకు సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నది. దీంతో రైతులు వరి తదితర పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ఇతర రాష్ర్టాల కూలీలు సైతం వలస వస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో ఇతర రాష్ర్టాల కూలీలు వ్యయసాయ పనులు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో పదిరోజుల నుంచి యువకులు వరి నాట్లు వేస్తూ కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఆయా రాష్ర్టాల్లో పనులు ఉండవని, అందుకే ఇక్కడికి వలస వస్తున్నామని వారు తెలిపారు. డబ్బులను సంపాదించుకోవడానికి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను వదిలిపెట్టి సుమారు రెండు నెలలపాటు ఇక్కడే ఉంటామని చెప్పారు.
వేగంగా వరి నాట్లు
ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కూలీలు వరినాట్లు వేగంగా వేస్తున్నారని దీంతో పనులు త్వరగా పూర్తవుతున్నాయని ఇక్కడి రైతులు చెబుతున్నారు. వీరు నాటువేసే కర్రలు తక్కువగా, నాటువేసిన వరి కర్రల మధ్య ఎడం కాస్త ఎక్కువగా ఉంటోంది. ఇలా నాటు వేసిన వరి పొలంలో దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో రైతులు ఇలాంటి నాటు విధానాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీరితోనే ఎక్కువ మంది రైతులు వరినాట్లు వేయిస్తున్నారు.
అక్కడ పని కరువై వలస వచ్చాం
మా రాష్ట్రంలో పని కరువై పొట్టచేతన పట్టుకొని తెలంగాణకు వచ్చి బతుకుతున్నాం. ఈ రెండు నెలలు మాకు పని కల్పిస్తున్న ఈ ప్రాంతానికి ఎంతో రుణపడి ఉంటాం. ఇక్కడి రైతులు కూడా చాలా మంచివారు. మాకు ఎంతో మర్యాద ఇస్తూ బాగా చూసు కుంటున్నారు. మేము ఏటా ఈ సమ యంలో వచ్చి రెండు నెలలు ఉండి పనులు చేసుకుంటాం. మళ్లీ మా రాష్ర్టానికి వెళ్తాం. పనిచేసిన డబ్బులను వారం రోజులకు ఒకసారి మా కుటుంబ సభ్యులకు పంపుతాం. ఇక్కడ పని దొరక్కపోతే మా భార్యా పిల్లలు పస్తులే. – సర్దార్, పశ్చిమబెంగాల్
పథకాలు బాగున్నాయి..
తెలంగాణలో అమలవుతున్న సంక్షే మ పథకాలు మా రాష్ట్రంలో లేవు. మా రాష్ట్రంలో గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు. ఇక్కడ రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛను వంటి పథకాల గురించి ఇక్కడి కూలీలు, రైతులు చెబుతుంటే విని ఆశ్చర్య పోయాం. తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉంటే ఇలా అభివృద్ధి చెందేది. మేము పనుల కోసం మా రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ మాకు రోజుకు రూ.500 కూలీ ఇస్తున్నరు. – శివకుమార్ హల్దా, పశ్చిమబెంగాల్
ఎకరానికి రూ.3800నుంచి రూ.4000
ఇరత రాష్ర్టాల నుంచి వలస వచ్చిన యువకులు నలుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి పనులు చేస్తున్నారు. ఒక రోజు ఒక ఎకరం పొలంలో వరి నాట్లు వేసేందుకు నలుగురికి కలిపి రూ.3800 నుంచి రూ.4000 వరకు తీసుకుంటారు. ఒక్కొక్కరికి రోజుకు సుమారు రూ.వెయ్యి వరకు కూలీ గిట్టుబాటు అవుతోందని కూలీలు తెలిపారు. వరి నాటు వేసేందుకు ఇక్కడి మహిళా కూలీలకు రైతులు రోజుకు రూ.580 చెల్లిస్తున్నారు. ఎకరంలో వరి నాట్లు వేసేందుకు సుమారు పది మంది మహిళా కూలీలు అవసరమని రైతులు అంటున్నారు.
బాన్సువాడలో యూపీ కూలీలు..
బాన్సువాడ మండలంలో వరినాట్లు ఊపందుకున్నాయి. ఇక్కడ నాట్లు వేసేందుకు ఇతర రాష్ర్టాలకు చెందిన మగకూలీలు వచ్చారు. ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు నాట్లు వేస్తున్నారు. స్వరాష్ట్రంలో పనులు లేకపోవడంతోపాటు తెలంగాణలో పెద్ద ఎత్తున వరినాట్లు ఉండడంతో వలస వచ్చారు. ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలతో నాట్లు వేయించడంతో ఎకరానికి రూ.2వేల వరకు పెట్టుబడి తగ్గుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నాట్లు సైతం వేగంగా వేస్తుండడంతో రైతులు వారినే ఆశ్రయిస్తున్నారు.