బిల్లుల మోతతో కరెంటు జోలికే వెళ్లని బడుగుల జీవితాల్లో కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అభివృద్ధి వెలుగులు ప్రకాశిస్తున్నాయి. వారి కుటుంబాల్లో గుణాత్మక మార్పును తెస్తున్నాయి. రైతు సంక్షేమంలో భాగంగా ఇప్పటికే వ్యవసాయానికి 24గంటలపాటు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీల గృహావసరాలకు సైతం ఉచితంగా విద్యుత్ను అందిస్తూ వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నది. పేదరికంలో మగ్గిపోతున్న హరిజన, గిరిజన గ్రామాలు, తండాలు, గూడేల్లో వెలుగులు నింపేందుకు సంకల్పించిన ఉద్యమనేత కేసీఆర్.. ఈ వినూత్న పథకాన్ని 2019 నుంచి అమలు చేస్తున్నారు. నెలకు వంద యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది బడుగుల జీవితాల్లో ఉచిత కరెంటు పథకం వెలుగులు విరజిమ్ముతున్నది. సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో తమ ఇంటికి ఉచితంగా వెలుగులు తీసుకురావడంతో లబ్ధిదారులు నిండు మనస్సుతో దీవిస్తున్నారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 6
మెండోరా, జనవరి 6: మేం గరీబోళ్లం. బిల్లుల బాధకు నిన్న మొన్నటిదాకా మాఇంట్ల దీపం తప్ప కరెంటు బల్బు ఎట్లుంటదో తెల్వదు. కేసీఆర్ సారు మాసుంటోల్లకు కరెంటు కష్టాలు లేకుండా చేసిండు. ఫ్రీగా మీటరు, కరెంటు ఇస్తేనే మా ఇంట్ల వెలుగు వచ్చింది. నెలనెలా పైసలు కూడా తీసుకుంటలేరు. ఆయనకు రుణపడి ఉంటాం.
-కోడముంజ పద్మ, పోచంపాడ్
కమ్మర్పల్లి, జనవరి 6 : ఇండ్లల్లో వినియోగించుకునే కరెంటుకు వంద యూనిట్ల దాకా సబ్సిడీ ఇస్తున్న సీఎం కేసీఆర్.. దళితులకు ఎంతో అసరా అవుతున్నారు. ఇంతకు మునుపు పేదకుటుంబాలు కరెంటు, మీటరు జోలికి పోయెటోళ్లు కాదు. బిల్లుల భారం మోయలేని కుటుంబాలకు ఫ్రీ కరెంటు పథకం వరం లాంటింది.
-పాలెపు రవి కిరణ్, నాగాపూర్
బాన్సువాడ టౌన్, జనవరి 6: మేము హరిజనవాడలో ఉంటాం. నలుగురు కుటుంబ సభ్యులు వాడుకునే కరెంటుకు ప్రతినెలా 230 రూపాయల బిల్లు వస్తది. ఎస్సీలకు వంద యూనిట్ల సబ్సిడీ ఇవ్వడంతో నెలనెలా వచ్చే బిల్లు మాఫీ అవుతున్నది. పేదలను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-దొన్కంటి వినోద్ కుమార్, ఎస్సీ కాలనీ, బాన్సువాడ
బాన్సువాడ టౌన్, జనవరి 6: ఇంతకుముందు పైసల్లేక బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసెటోళ్లు. ఎస్సీలకు కేసీఆర్ ఫ్రీ కరంటు ఇస్తున్నడని సర్కారు సార్లు చెప్పిండ్రు. మాకు వచ్చేటి కరెంటు బిల్లులను మాఫీ జేస్తున్నరు. అప్పటి నుంచి మేము బిల్లు కట్టుడే లేదు. మాలాంటి గరీబోళ్లకు మేలుజేస్తున్న కేసీఆర్ సల్లగుండాలె.
-పర్వవ్వ, ఎస్సీ కాలనీ, బాన్సువాడ
ఏర్గట్ల, జనవరి 6: గరీబోళ్లకు కరెంటు వెలుగులను ఇచ్చిన దేవుడు సీఎం కేసీఆర్. గతంలో జబర్దస్తీగా బిల్లులు వసూలు చేసేటోళ్లు. ఇప్పుడు దళితకుటుంబాలకు వంద యూనిట్ల దాకా బిల్లులను మాఫీ చేస్తున్నారు. అదికూడా కోతలు లేకుండా కరెంటును సరఫరా చేస్తున్నారు. పేద కుటుంబాలకు కరెంటు బిల్లుల భారం తగ్గింది.
-గన్నారపు రాజేశ్వర్, ఏర్గట్ల