ఖలీల్వాడి/శక్కర్నగర్/ కామారెడ్డి, మార్చి 4: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో జిల్లాలోని వేర్వేరు సెంటర్లలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ సోమవారం ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు, విజేత జూనియర్ కళాశాలలో మరో విద్యార్థి కాపీయింగ్ చేస్తుండగా ఫ్లయిం గ్ స్కాడ్ పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు డీఐఈవో రఘురాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 809 మంది విద్యార్థులు గైర్హాజరుకాగా, 96శాతం హాజరయ్యారు.
జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ, స్కాడ్ల ఆధ్వర్యంలో 47పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరంలోని కాకతీయ, సీఎస్ఐ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సెంటర్లను జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. కామారెడ్డి జిల్లాలో 9813 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.