ఖలీల్వాడి, డిసెంబర్ 15: అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులతో ఆయిల్ పామ్ పంట సాగుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ పంట సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 1718 ఎకరాల్లో మాత్రమే సాగుకు రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. వచ్చే వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తిస్థాయి విస్తీర్ణంలో రైతులు ఆయిల్పామ్ సాగు చేపట్టేలా కృషి చేయాలని సూచించారు. సంసిద్ధత తెలిపిన రైతుల నుంచి డీడీలు సేకరించి జిల్లా ఉద్యానవన శాఖ అధికారికి శుక్రవారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. ఆయిల్పామ్ సాగుతో సమకూరే లాభాల గురించి వివరిస్తూ రైతుల్లో నమ్మకాన్ని కలిగించాలన్నారు. సంప్రదాయ వరి సాగుతో కనీసం మూడింతలు ఎక్కువగా స్థిరమైన పద్ధతిలో ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయిల్ పామ్తోపాటు అంతర పంట సాగు చేయవచ్చని సూచించారు. కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా ఆయిల్పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఇన్ఫుట్ సబ్సిడీని అందిస్తూ అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. ఆయిల్పామ్ సాగుతో తప్పనిసరిగా లాభాలు సమకూరుతాయని రైతుల్లో గట్టి భరోసా కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత సీజన్కు సంబంధించిన లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.