కోటగిరి, అక్టోబర్ 20: చివరి మజిలీకి ఎలాంటి చింత లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన వైకుంఠధామాలను నిర్మించింది. ఒక్కో గ్రామంలో రూ.10లక్షలతో నిర్మాణాలు చేపట్టారు. ఇందులో దహనం చేసేందుకు రెండు ప్లాట్ఫాంలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మూత్రశాలలు, స్నానాల గదులు, స్టోర్రూం, ఓవర్హెడ్ ట్యాంకు నిర్మించాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపుకొన్నారని ప్రజలు వాపోతున్నారు. నీరు, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించడం చాలా ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటగిరి మండల వ్యాప్తంగా గ్రామానికో శ్మశాన వాటిక మంజూరు కాగా వంద శాతం నిర్మాణాలు పూర్తయినప్పటికీ సరైన సౌకర్యాలు లేక వృథాగా మారుతున్నాయి.
టాక్లీలో ఇలా..
కోటగిరి మండలం టాక్లీ గ్రామ పంచాయతీ పరిధిలో రూ.10లక్షలతో మూడేండ్ల క్రితం వైకుంఠథామం నిర్మించారు. నీరు,విద్యుత్ సౌకర్యం లేకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వైకుంఠధామంలో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి భయంకరంగా మారింది. విద్యుత్ కనెక్షన్ కోసం పంచాయతీ వారు డబ్బు చెల్లించినా ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నేటి వరకు కరెంట్ సరఫరా లేదని గ్రామస్తులు వాపోతున్నారు. వైకుంఠధామం వద్ద బోరుబావి తవ్వించి ఐదు నెలలు గడిచినా మోటరు బిగించకపోవడం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
కొడిచెర్లలో నీటి సౌకర్యమే లేదు..
కొడిచెర్ల వైకుంఠధామం నిర్మించి ఏండ్లు గడస్తున్నా ఇప్పటివరకు అంత్యక్రియలకు ఉపయోగించలేదని స్థానికులు తెలిపారు. విద్యుత్, నీటి సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు. అంత్యక్రియల కోసం గ్రామస్తులు కొడిచెర్ల- కల్లూర్ గ్రామం మధ్యలోని పాత శ్మశానవాటికను ఉపయోగిస్తున్నారని స్థానికులు తెలిపారు.
చర్యలు తీసుకుంటాం..
మండలంలోని పలు గ్రామాల్లోని వైకుంఠధామాల్లో సమస్యలు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. నీటి సౌకర్యం, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉన్నా.. పంచాయతీ సిబ్బంది వాటిని ఏర్పాటు చేయలేదని తెలిసింది. సంబంధిత పంచాయతీ సిబ్బందితో మాట్లాడి విద్యుత్తోపాటు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటాం. వైకుంఠధామం శుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందికి సూచిస్తా.
– మారుతి, ఇన్చార్జి ఎంపీడీవో, కోటగిరి