కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజ
విద్యుత్ వినియోగంలో నంబర్వన్
అభివృద్ధికి రిజర్వ్ బ్యాంక్ హ్యాండ్ బుక్కే సాక్ష్యం
ఆటా మహాసభల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్పల్లి, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస భారతీయులు కృషిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నదని పేర్కొన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన 17వ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్గా ఉందన్నారు.ఇటీవలే ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల కృషితో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోందన్నారు. ఆయా రంగాల్లో వారి విజయాలతో అమెరికాలో తెలుగు రాష్ర్టాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయన్నారు.
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆటా మహా సభలు నిర్వహించారని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని కోరారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో డాక్టర్లుగా, ఐటీ, వివిధ రంగాల్లో స్థిర పడి తెలుగు వారి గౌరవాన్ని ఇనుమడిస్తున్న ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. మంత్రు లు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు ధర్మా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు.