Nizam Sagar | కామారెడ్డి, జూన్ 20 (నమస్తే తెలంగాణ)/ నిజాం సాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. వానాకాలం సీజన్లో ముందస్తు పంట సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులైనా తొలకరి ఇప్పటివరకూ పలుకరించలేదు. దీంతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి.. రైతుల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయించేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడారు.
సోమవారం కేసీఆర్ను కలిసి నిజాంసాగర్ ఆయకట్టు కింద నారు మడులు వేసుకున్నారని, ఇక్కడ ముందస్తు సాగు చేసుకుంటారని నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్..సాగర్ నుంచి నీటి విడుదలకు అంగీకరించారు. ఈ మేరకు బుధవారం నుంచి ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయనున్నారు. ఉదయం 6 గంటలకు స్పీకర్ పోచారం, జడ్పీ చైర్పర్సన్ ధపేదార్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రధాన కాలువలోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నా రు.
ప్రాజెక్టు ఆయకట్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, వర్ని, నస్రుల్లాబాద్, కోటగిరి, చందూర్ మండలాల్లోని రైతులు వరి నారు పోసుకున్నారు. ఆయా భూములకు వరినాట్ల కోసం సాగర్ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించనున్నారు. నాట్లతో పాటు మూడు తడులకు సరిపడా నీరు నిజాంసాగర్లో ఉన్నందున మూడు విడుతల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అవసరమైతే కొండపోచమ్మ సాగర్ నుంచి..
ప్రస్తుతం నిజాంసాగర్లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీరు పంటల సాగుకు మూడు తడుల కోసం సరిపోతుంది. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన పక్షంలో నిజాంసాగర్లో నీరు నిల్వ ఉండడం కష్టమే. దీంతో ముందస్తు జాగ్రత్తగా స్పీకర్ పోచారం ..సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం నిజాంసాగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండ పోచమ్మసాగర్ను నింపి అక్కడి నుంచి 5 టీఎంసీల నీటిని నిజాంసాగర్కు పంపిస్తామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మసాగర్లో ప్రస్తుతం 9 టీఎంసీల నీరు ఉంది.
అవసరమైతే ఇంకొన్ని టీఎంసీల నీటిని కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా నింపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వానకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని భూ ములకు సరిపడా నీరు నిల్వ ఉంటుంది. మంజీరా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పుష్కలంగా కురిసిన పక్షంలో నిజాంసాగర్లోకి నీరు వస్తుంది. లేని పక్షంలో కొండపోచమ్మ సాగర్ నుంచి నీరు రానున్నది. దీంతో రైతులు నిర్భయంగా పంటలను సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీ ఎంసీ లు) కాగా.. ప్రస్తుతం 1391.93 అడుగుల (4.94 టీఎంసీలు)వద్ద ఉన్నదని డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు.
సాగునీటికి ఇబ్బందులు ఉండవు
నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రైతుల కోసం బుధవారం నుంచి విడుదల చేయనున్నాం. నీటి విడుదలకు స్పీకర్ పోచారం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా నిజాంసాగర్కు ఢోకా లేదు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్కు, అక్కడి నుంచి నిజాంసాగర్కు విడుదల చేయనున్నారు. 5 టీఎంసీల నీరు నిజాంసాగర్లోకి రానున్నది. రైతులు నిశ్చింతగా పంటలను సాగు చేసుకోవచ్చు.
-శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, కామారెడ్డి నీటిపారుదల శాఖ