కమ్మర్పల్లి, జూన్ 27: ఎస్సారెస్పీ వరద కాలువ మళ్లీ నిండుకుండలా మారుతున్నది. కాళేశ్వరం జలాలు ఎదురేగి వచ్చి వరద కాలువను నింపుతున్నాయి. మూడేండ్లుగా వరద కాలువ కింద వానకాలం, యాసంగి పంటలకు కాళేశ్వరం జలాలు అందుతున్నాయి. దీంతో రెండు కాలాలు నిండుగా పంటలు పండుతున్నాయి. రైతన్నకు ఇదే ఆనందాన్ని కొనసాగిస్తూ వానకాలం సాగుకు మరో సారి వరద కాలువను నింపుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. గాయ త్రి పంపు హౌస్కు శుక్రవారం సాయంత్రం చేరిన కాళేశ్వరం జలాలు అదే రోజు రాత్రి నుంచి జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంపు హౌస్కు చేరాయి. అక్కడి నుంచి వరద కాలువలో ఎదురు పారడం ప్రారంభించాయి. శనివారం సాయంత్రానికి జగిత్యాల జిల్లా రాజేశ్వర్ రావు పేట్ పంపు హౌస్కు చేరుకున్నాయి. ఇదే రాత్రి అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లాలో ప్రవేశించాయి. ఆదివారం ఉదయానికి జిల్లాలో వరద కాలువ సుమారు 4 మీటర్ల నుంచి 5 మీటర్ల మట్టం తో నిండి పోయింది. మొత్తం వరద కాలువ తొమ్మిది మీటర్ల మట్టంతో నింపుతారని, సోమవారం నాటికి జిల్లాలో వరద కాలువలో తూములన్నింటి ద్వారా నీటి విడుదల జరిపే అవకాశం ఉన్నట్లు వరద కాలువ ఏఈ రఘు తెలిపారు. వరద కాలువ కింద జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6,500 ఎకరాలకు సాగు నీటి ప్రయోజనం కలుగుతున్నది. నీటి విడుదలతో వరద కాలువ బెల్టు రైతులు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చేసిన కృషిని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.