వెల్దుర్తి, ఏప్రిల్ 16 : తెలంగాణ ప్రాంత రైతుల దశదిశను రాష్ట్ర సర్కారు మార్చిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మం డల పరిధిలోని హకీంపేట గ్రామ శివారులో ఉన్న హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి, అలుగుపారడంతో ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు శుక్రవారం పూజలు చేశారు. గోదావరి జలాలకు పాలతో అభిషేకాలు చేసి, పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించారు. అలుగు నీటిలో పూలు చల్లారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండుటెండల్లో హల్దీవాగు ప్రాజెక్టు పొంగి, అలుగు పారడం, చెక్డ్యాములు మత్తడి దూకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గోదావరి నీళ్లు హల్దీవాగు ప్రాజెక్టులో పారడం కలలో కూడా ఊహించనిదన్నారు.
కాలం, వానలతో పని లేకుండా ఎలాంటి నదులు లేని చోట్ల రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు కట్టి, గోదావరి జలాలను మళ్లించి ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అద్భుతమైన పంటలు పండించే అవకాశం తెలంగాణ ప్రజలకు ఉందని, కానీ, గతంలో పొలాలు అచ్చు కట్టాలన్న, తుకాలు పోయాలన్న, దుక్కి దున్నాలన్న మబ్బులకేసి చూడాల్సి వచ్చేదన్నారు. కానీ, ఇప్పుడు వానల కోసం ఎదురుచూడకుండా రోహిణికార్తెలోనూ తుకాలు పోసి, పంటల సాగులు ప్రారంభించుకోవచ్చన్నారు. 70ఏండ్లలో సాధించని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడేండ్లలో చేసి చూపించారని కొనియాడారు. గోదావరి జలాలతో హల్దీ, మంజీర పరీవాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేయనున్నారన్నారు.
11 రోజు వెల్దుర్తి చెక్డ్యామ్కు..
కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా హల్దీవాగులోకి బిరబిరా వస్తున్న గోదావరి జలాలతో మాసాయిపేట మండల పరిధిలోని హకీంపేట గ్రామశివారులో ఉన్న హల్దీప్రాజెక్టు మండుటెండల్లో అలుగుపారి, కొప్పులపల్లి చెక్డ్యామ్ నిండింది. 11వ రోజైన శుక్రవారం వెల్దుర్తి చెక్డ్యామ్కు నీళ్లు ప్రవహిస్తున్నాయి. శనివారం వెల్దుర్తి చెక్డ్యామ్ నిండే అవకాశం ఉంది.
ఇవీ కూడా చదవండీ…