బోధన్, మార్చి 16: క్రీడా రంగంలో బోధన్ నియోజకవర్గానికి గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. విద్యార్థులు, యువకులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల్లో మంచి తర్ఫీదును పొందాలని సూచించారు. బోధన్ పట్టణం శక్కర్నగర్లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ మైదానంలో ‘ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ స్పోర్ట్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళ వారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను ఎమ్మెల్యే షకీల్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావుతో కలిసి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలతో శక్కర్నగర్లో అధునాతన సౌకర్యాలతో క్రీడా స్టేడియాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. స్థానికంగా యువకులను ప్రోత్సహించడానికి రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో బోధన్లో జాతీయస్థాయి లేదా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తామన్నారు. యువతకు ఉపాధి కోసం కొత్తగా పరిశ్రమలు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామన్నా రు. పది రోజులపాటు కొనసాగనున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర క్రీడలశాఖ మంత్రిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లకు కృషిచేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ సోయెల్, పలువురు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ చైర్మన్ బుద్దె సావిత్రి రాజేశ్వర్, జడ్పీటీసీ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు దేశాయ్, ఎం.ఎ.రజాక్, జి.శ్యామ్రావు, బుద్దె రాజేశ్వర్, ఎల్లయ్య యాదవ్, సాలూరా షకీల్, రఫీయొద్దీన్, భవానీపేట్ శ్రీనివాస్, మహిమూద్, పంపరి నవీన్, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి కూడా టీమ్లు వచ్చాయి. మొత్తం 80 జట్లు పాల్గొంటున్నాయని క్రీడల నిర్వాహక ప్రతినిధి ఎత్తేషాం సోయెల్ తెలిపారు.