ఖలీల్వాడి, మార్చి 31 : బీఆర్ఎస్కు కార్యకర్తలే శ్రీరామరక్ష అని, వారి కు టుంబాలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఓ సోదరుడిగా అండగా నిలబడుతానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని దుబ్బ మున్నూరుకాపు సంఘంలో శుక్రవారం ఆరు డివిజన్ల కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. కార్యకర్తల కుటుంబ సభ్యులను కలవడం ఆనందంగా ఉన్నని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. దేశానికి మోడల్ తెలంగాణ రాష్ట్రం అయితే.. తెలంగాణకు మోడల్ నిజామాబాద్ అని వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో నగరం.. హైదరాబాద్ తర్వాతి స్థానంలో ఉన్నదని తెలిపారు.
శాంతి భద్రతలకు కేరాఫ్ నిజామాబాద్ అని, సురక్షిత నగరం కావడంతోనే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. స్థానిక యువతకు అవకాశాలు కల్పించేందుకు ఐటీ హబ్, న్యాక్ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. రఘునాథ చెరువుపై మినీ ట్యాంక్బండ్తోపాటు నగరాన్ని అందమైన మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తిచేశామని, ఆధునిక సౌకర్యాలతో వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్లు, ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, గడపగడపకూ తాగునీరు సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. నగర అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్ మరో రూ. 100 కోట్లు మంజూరు చేశారని, వీటిని సమగ్ర ప్రణాళికతో ప్రజలకోసం వినియోగిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు కార్పొరేట్ వసతులు కల్పించి ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. గురుకులాలు ఏర్పా టు చేసి ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. లక్షా 20వేలు ఖర్చు చేస్తున్నదని వివరించారు. మరోసారి అధికారం మనదేనని, ఎనిమిదేండ్లలో చేసిన అభివృద్ధి, అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, పార్టీ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి అనితా సురేశ్, 17వ డివిజన్ కార్పొరేటర్ మాయవార్ సవితా రాజు, నాయకుడు సాయిరాం, 37వ డివిజన్ కార్పొరేటర్ కాంపల్లి ఉమారాణి, ముత్యాలు, నాయకులు సంతో ష్, కో-ఆప్షన్ మెంబర్లు దారం సాయిలు, చంద్రకళ, 38వ డివిజన్ నాయకులు సహదేవ్, షఫీ, 39వ డివిజన్ కార్పొరేటర్ లతా కృష్ణ, 40వ డివిజన్ కార్పొరేటర్ శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు బీఆర్ఎస్పైనే నమ్మకం: ఎంపీ సురేశ్రెడ్డి
ప్రజలకు బీఆర్ఎస్పై పూర్తి నమ్మకముందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు.పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు ఆత్మీయసమ్మేళనంలో పాల్గొనేందుకు తాను నేరుగా ఢిల్లీ నుంచి నగరానికి వచ్చానని తెలిపారు. ఎమ్మెల్యే గణేశ్గుప్తా.. నగర ప్రజలందరికీ విజయవంతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని అన్నారు. దుబ్బ ప్రాంతంలో ఎక్కడకూడా దుబ్బ కనబడడం లేదని, హరితవనంలా కనబడుతున్నదని అన్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు ఐటీని తీసుకువచ్చిన ఘనత బిగాలదేనని అన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్గా పనిచేసిన సమయంలో నిత్యం నీరు, కరెంటు, అభివృద్ధి కోసం ప్రజలు ఆందోళనలు చేసేవారని, తెలంగాణ వచ్చాక అలాంటి సమస్యలన్నీ సీఎం కేసీఆర్ దూరం చేశారని గుర్తుచేశారు.
ప్రపంచమే ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో తెలంగాణకు సాగునీటి సమస్య అనేదే లేకుండా చేశారని తెలిపారు. తాను నెలరోజులుగా ఢిల్లీలోనే ఉన్నానని, పార్లమెంటులో ఎంపీల నోర్లు మూయించి తెలంగాణపై అనేక కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడంతా చీకటి ప్రపంచం ఉండగా, తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం కనబడుతున్నదని అన్నారు. పన్నుల రూపంలో ఢిల్లీకి నిధులు పంపిస్తే అభివృద్ధి కోసం తిరిగివ్వకుండా వారి జేబుల్లోనే వేసుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో మత విద్వేషాలు తప్ప.. అభివృద్ధి ఊసేలేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే లోపలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి..
ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. 17వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్, నాయకులు వెంకట్రామ్రెడ్డి, మల్లేశ్కు ఎమ్మెల్యే బిగాల, ఎంపీ సురేశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మాకు తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే..
ఇప్పటివరకు చాలా మంది సీఎంలు వచ్చిం డ్రు.. పోయిండ్రు. ఏపార్టీ లీడర్లు ప్రజలను పట్టించుకోలే. తెలంగాణ వచ్చినంక బీఆర్ఎస్ పార్టీ గరీబోళ్లకు చాలా మేలు చేస్తున్నది. మాకు తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. మళ్లీ ఆయననే గెలిపిస్తం.
–పద్మ, అంబేద్కర్ కాలనీ, నిజామాబాద్