ఖలీల్వాడి, జూన్ 5: తెలంగాణ ప్రభు త్వం ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పరిశ్రమలకు పునర్జీవం వచ్చిందని, దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన సాధ్యమయ్యిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని పవర్హౌస్లో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ను అందిస్తూ రైతన్నకు దన్నుగా నిలుస్తున్నదన్నారు. కులవృత్తిని నమ్ముకున్న వారికి చేయూతగా 250 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నదని, సమైక్య పాలనలో పవర్ హాలీడేతో మూతబడ్డ పరిశ్రమలకు స్వరాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తో జీవం పోసి, కార్మికుల జీవితాల్లో వెలుగు నింపినట్లు గుర్తు చేశారు.
రాష్ట్రంలో బిజిలీలు, కిరోసిన్ దీపాలు కనుమరుగయ్యాయని వివరించారు. నగరంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పక్కకు జరిపి రోడ్లు నిర్మించామని, పట్టణ ప్రగతిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. రూ.6 కోట్లతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు వెల్లడించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు విరజిల్లేలా మార్చినందుకు విద్యుత్శాఖ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, డీఈ ఎం.శ్రీనివాస్, ఏడీఈ తోట రాజశేఖర్, చంద్రశేఖర్, వెంకటరమణ, ఉద్యోగులు పాల్గొన్నారు.