కారుచీకట్లు తొలగిపోయాయి. కాంతి వెలుగులు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. ఒకప్పుడు చిమ్మచీకట్లలో మగ్గిపోయిన పల్లెలు, పట్టణాలు ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నాడు అంధకారంలో చిక్కుకున్న మండల కేంద్రాల్లో ప్రస్తుతం హై‘మస్త్’ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మన పల్లెలు, పట్టణాల అభివృద్ధిని పట్టించుకున్న వారే లేరు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, వీధి దీపాలు.. ఇలా మౌలిక వసతులను పూర్తిగా గాలికొదిలేశారు. కానీ తెలంగాణ సిద్ధించాక, కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టాక అభివృద్ధి వేగవంతమైంది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా ప్రగతి విస్తృతమైంది. నిరంతర విద్యుత్, స్వచ్ఛమైన తాగునీరు, ఊరూరికీ తారు రోడ్లు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు.. అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇక మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవతో బాల్కొండ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ప్రధానంగా మండల కేంద్రాలు కొత్తరూపు సంతరించుకున్నాయి. సువిశాలమైన రోడ్లతో పాటు మధ్యలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుతో సరికొత్త వెలుగుల్లో మురిసి పోతున్నాయి. రోడ్డు డివైడర్లు, వాటి మధ్యలో మొక్కలతో పట్టణాలను తలపిస్తున్నాయి.
కమ్మర్పల్లి, అక్టోబర్ 20 : ఉమ్మడి పాలనలో కారుచీకట్లలో మగ్గిపోయిన ప్రాంతాలు ఇప్పుడు కాంతులీనుతున్నాయి. సువిశాలమైన రోడ్లు, వెలుగులు విరజిమ్ముతున్న హైమాస్ట్ లైట్లతో కొత్త శోభ సంతరించుకున్నాయి. ఒకప్పుడు కరెంటు కష్టాలు, చిమ్మచీకట్లు, ఇరుకైన రహదారులతో గోస పడిన ప్రజలకు సీఎం కేసీఆర్ పాలనతో సాంత్వన చేకూరుతున్నది. సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేరుతున్నాయి. ముఖ్యమంత్రి కృషితో విద్యుత్ కోతలే లేకుండా పోయాయి. నల్లతాచులా నిగనిగలాడే తారు రోడ్లు ఊరూరికి విస్తరించాయి. పల్లె పల్లెకూ సువిశాలమైన రోడ్లు నిర్మితమయ్యాయి. ఇక, బాల్కొండ నియోజకవర్గంలోనైతే అన్ని మండల కేంద్రాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. పట్టణాలను మరిపించేలా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవతో తీరిపోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా పనులు..
మండల కేంద్రాల అభివృద్ధిపై పై మంత్రి వేముల ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో నియోజకవర్గ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఒక్కొక్క మండల కేంద్రాన్ని ప్రాధాన్యతా క్రమంలో తీసుకుంటూ కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. నాలుగు వరుసల రోడ్లుగా విస్తరించడంతో పాటు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పట్టణాలకు తీసి పోని విధంగా తీర్చిదిద్దుతున్నారు. బాల్కొండతో పాటు వేల్పూర్లో ఇప్పటికే హై‘మస్తు’ వెలుగులు ప్రసరిస్తున్నాయి.
బాల్కొండ, వేల్పూర్లలో..
బాల్కొండలో ప్రధాన రహదారి ఇరుగ్గా, గుంతలు తేలి ఉండేది. అంతర్గత రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. అయితే, మంత్రి ప్రశాంత్రెడ్డి రూ.9 కోట్లు మంజూరు చేయించి ప్రధాన రహదారిని నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరణ చేయించడంతో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించారు. అంతర్గత రహదారులను బీటీ రోడ్లుగా మార్చారు. అలాగే, వేల్పూర్ మండల కేంద్రంలో రూ.5 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించారు. దీంతో బాల్కొండ, వేల్పూర్ మండల కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందు తొలగి పోయాయి. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గి పోయాయి.
భీమ్గల్లో అభివృద్ధి పరుగులు..
భీమ్గల్ పట్టణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మట్టితో దుమ్ము రేగే రోడ్లకు భీమ్గల్ ఒకప్పుడు పెట్టింది పేరు. అధ్వానమైన రోడ్లకు సింబాలిక్గా ఉండేది భీమ్గల్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో భీమ్గల్ను మున్సిపాలిటీగా మార్చిన మంత్రి వేముల.. పట్టణంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రూ.14 కోట్ల వ్యయంతో ప్రధాన రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా విస్తరించడంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తున్నారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
వేగంగా పనులు..
రూ.8 కోట్ల వ్యయంతో మోర్తాడ్ మండల కేంద్రంలో నేషనల్ హైవే నుంచి గ్రామం వరకు, జాతీయ రహదారిపై పాలెం రోడ్డు నుంచి తహసీల్ కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మోర్తాడ్ గ్రామం నుంచి హైవే వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయ్యాయి. ఇక, కమ్మర్పల్లి మండల కేంద్రంలో రూ.5 కోట్లతో పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ దవాఖాన వరకు నాలుగు వరుసల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభమయ్యాయి.
ప్రశాంత్రెడ్డితోనే సాధ్యమైంది..
బాల్కొండ మొదటి నుంచి జాతీయ రహదారిపై ఉం ది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ముప్కాల్, మెండోరా మండలాల ప్రాంతమంతటికీ గతంలో మండల కేంద్రంగా ఉండేది. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలె. మండల కేంద్రంలో నాలుగు వరుసల రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఉండాలని కలగా ఉండె. మంత్రి తోనే అది నెరవేరింది.
– ఆకోజి సుభాష్, బాల్కొండ
కొత్త అందాలు అద్దినట్లుంది..
సెంట్రల్ లైటింగ్తో బా ల్కొండ మండల కేంద్రానికి కొత్తందాలు అద్దినట్లయింది. గతంలో సాయంత్రమైతే చాలు మొత్తం చీకటిగానే ఉండేది. కానీ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో ఇప్పు డు సరికొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. మంత్రి ప్రశాంత్రెడ్డికి బాల్కొండపై ఉన్న కొండంత ప్రేమకు ఇది నిదర్శనం.
– గంగాకిషన్, బాల్కొండ
మంత్రితోనే కల నెరవేరింది..
గతంలో మోర్తాడ్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన నాయకులెవరూ మాట నిలబెట్టుకోలేదు. ప్రశాంత్రెడ్డి లేకపోతే మోర్తాడ్లో ఈ కల నెరవేరేది కాదు. మంత్రి కృషితో మోర్తాడ్కు నాలుగు వరుసల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి వస్తున్నది.
– శివకుమార్, మోర్తాడ్
వేల్పూర్లో కొత్త వెలుగులు..
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో కొత్త వెలుగుల్లో వేల్పూర్ మెరిసి పోతున్నది. రోడ్డు మధ్య డివైడర్ నిర్మాణంతో వేల్పూర్ పట్టణంగా కనిపిస్తున్నది. మా గ్రామానికి చెందిన మంత్రి.. మా ఊరికి ఇచ్చిన వరం ఇది.
– పురుషోత్తం, వేల్పూర్
కలలో కూడా ఊహించలేదు..
భీమ్గల్లో నాలుగు వరుసల రోడ్డు, సెంట్రల్ లైటింగ్తో వస్తాయని కలలో కూడా ఊహించలేదు. ఒక వైపు డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మరో వైపు అంతర్గత బీటీ రోడ్లు, ప్రధాన రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్తో భీమ్గల్ పట్టణం కొత్తరూపు సంతరించుకున్నది. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డికి ధన్యవాదాలు.
– బోనగిరి శ్రీనివాస్, భీమ్గల్