జగిత్యాల, మార్చి 26, (నమస్తే తెలంగాణ)/జగిత్యాల రూరల్: ‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శించడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం తప్ప ఆయనకు ఏది చేతకాదు’ అని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ లీడర్లకు షుగర్ ఫ్యాక్టరీ అంశం ఎన్నికల స్టంట్గా మారిందని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తమని మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనడం ఆశ్చర్యంగా ఉందని.. అయినా ఫ్యాక్టరీ పాత డోర్లు తెరవడం తప్ప వారు చేసేదేంలేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయాలని చూస్తున్న మాజీ మంత్రి, పట్టభధ్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాటలు ప్రజల చెవిలో పూలు పెట్టేలా ఉన్నాయని విమర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలన్న బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువాల్సిందేనని చెప్పారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని పౌలస్తేశ్వరాలయంలో పూజలు చేసి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం జగిత్యాల పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందుల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గులాబీ జెండా ఎగురేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం తరపున ప్రశ్నించే గొంతుక అవుతానని స్పష్టంచేశారు. నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలు అర్వింద్ను ఎంపీని చేసింది అభివృద్ధి చేయాలనే తప్పా, కేసీఆర్, కేటీఆర్, కవితలను తిట్టడానికి కాదని మండిపడ్డారు.