సిరికొండ/ధర్పల్లి/ఇందల్వాయి/చందూర్/ఖలీల్వాడి, మార్చి 16: నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, చందూర్ మండలాల్లో శనివారం అకాల వర్షం కురిసింది. సిరికొండ, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
సిరికొండ మండలం కొండూర్, పోత్నూర్, చిన్నవాల్గోట్, సిరికొండ, తాళ్లరామడ్గు, పందిమడుగు, చీమన్పల్లి, ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వాన కురవగా..పందిమడుగు, చీమన్పల్లి, నల్లవెల్లి గ్రామాల్లో పంట పొలాల్లో ధాన్యం గింజలు రాలిపోయాయి. పంట చేతికొచ్చే సమయానికి రాళ్ల వాన కురిసి పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ పంట నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
జిల్లా కేంద్రంతోపాటు ధర్పల్లి మండలంలో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇందూరు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్నిరోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న వారికి కొంతమేర ఉపశమనం లభించింది. ఎండిపోతున్న వరి పంటలకు చివరి తడికి నీరందినట్లయ్యిందని రైతులు చెబుతున్నారు.