ఖలీల్వాడి మార్చి 29: మాజీ ఎంపీ మధుయాష్కీ ఒక పొలిటికల్ టూరిస్టు అని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లడారు. కాంగ్రెస్ హయాంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్య రాలేదని మధుయాష్కీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. పట్టపగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు విద్యుత్ ఇచ్చేదని, అదికూడా ఎప్పుడు పోతదో దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణ ఉండేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తూ, రైతులవద్దకే కొనుగోలు కేంద్రాలు తీసుకువచ్చిందని తెలిపారు. రైతుబంధు పథకం అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చిన తరువాత ఒక్కరైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. ఈ విషయాలను మధుయాష్కీ మరచిపోయారన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. 2019 ఎన్నికల్లో పారిపోయిన మధుయాష్కీ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. డిపాజిట్రాని పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్సీ కవిత గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో కోలుకోని పరిస్థితికి పోతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అమ్ముడుపోయి బీజేపీని గెలిపించుకున్నారని ఆరోపించారు. ప్రజలు, రైతులకు ఎమ్మెల్సీ కవిత ఎల్లప్పుడు అండగా ఉన్నారని అన్నారు. రేవంత్రెడ్డి, మధుయాష్కీలు ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమవుతుందన్నారు. దిక్కులేని పార్టీగా కాంగ్రెస్ మిగిలిందని విమర్శించారు. ఆ పార్టీ వైఫల్యం వల్లే సారంగాపూర్ ఫ్యాక్టరీ ప్రైవేట్పరమైనట్లు చెప్పారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్లు కేంద్ర మంత్రులతోపాటు పార్లమెంట్లోనూ మాట్లాడిన ఘనత ఉందన్నారు. ఆమె చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో పని చేసిందన్నారు.
ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా!
ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని వంద రూపాయల బాండ్ పేపర్ రాసిఇచ్చి నాలుగేండ్లు గడిచిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని ప్రశ్నించారు. అడ్వాన్సులు తీసుకొని ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారుతోందన్నారు. పంజాబ్లో అధికారంలో ఉండగా, అదికూడా పోయిందన్నారు. 2014 నుంచి ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించుకుంటూ వస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధే విజయానికి కారణమని చెప్పారు. ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు, యాదగిరి లక్ష్మీనర్సింహ ఆలయం నంబర్వన్గా నిలిచాయన్నారు. కాంగ్రెస్వాళ్లు ఎప్పుడైనా ఇలాంటివి కట్టిస్తే కదా తెలిసేది అని ఎద్దేవా చేశారు. సమావేశంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఎనుగందుల మురళి, అలీం, అనిల్, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, అక్తర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.