ఖలీల్వాడి, డిసెంబర్ 17 : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడుదామని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని న్యూఅంబేద్కర్ భవన్లో సీఐటీయూ మహాసభలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై సీఐటీయూ జెండాను ఎగురవేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికులు, వారి వేతనాలు, కార్మిక చట్టాలపై దాడి చేస్తున్నదని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, వారి లాభాలను పరిరక్షించడం కోసం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు.
29 కార్మిక చట్టాలను క్రోడీకరించి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, ఈ అంశాలన్నీ కూడా కార్మికులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం, ఈఎస్ఐ, పని గంటలను పెంచడం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, ప్రజలపై ధరల భారాలను మోపడం తదితర అంశాలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటిత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపై సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ నివేదికను ప్రవేశపెట్టారు. చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రామ్మోహన్రావు, రాష్ట్ర కార్యదర్శి రమ, రమేశ్బాబు, దేవ గంగు, చక్రపాణి, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.