ఏర్గట్ల, డిసెంబర్ 17: అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, తహసీల్దార్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మండలంలోని రైతులు, ప్రజలకు వారి భూములు, రేషన్ కార్డుల విషయాల్లో సందేహాలుంటే తమను సంప్రదించాలని ఆయన అన్నారు. మండల కేంద్రంలోని పది బొంగుల వద్ద వంతెన నిర్మాణానికి మంజూరైన నిధులు, తీగల వాగుపై నిర్మించాల్సిన వంతెన వ్యయంపై చర్చించారు. మండలంలో అక్కడక్కడా స్వల్పంగా ధ్వంసమైన రోడ్లకు ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు మంజూరైన నిధుల వివరాలు తెలిపారు.
పంచాయతీ రాజ్ ఏఈ విక్రమ్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంజూరు చేసిన నిధుల వివరాలను వెల్లడించారు. అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఏఈ తెలిపారు. మండల వ్యవసాయాధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్, హార్టికల్చర్ అధికారి వ్యవసాయ రంగం, రైతులకు సంక్షేమ పథకాలు రైతు బంధు, రైతు బీమాపై వివరించారు. ఎంఈవో ఆంధ్రయ్య మనఊరు-మన బడి కార్యక్రమంలో కొనసాగుతున్న పనులను వివరించారు.
ఈజీఎస్పై పనులపై ఏపీవో వెంకటేశ్, హరితహారంపై ఎంపీవో శివచరణ్, మహిళా సంఘాల పొదుపుపై ఏపీఎం శ్యామ్ మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యుడు జక్కని మధుతోపాటు ఏర్గట్ల సర్పంచ్ గుల్లే లావణ్య, తాళ్ల రాంపూర్ సర్పంచ్ భీమనాతి భానుప్రసాద్, గుమ్మిర్యాల్ సర్పంచ్ రాజరెడ్డి తమ గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై అధికారులు స్పందించడం లేదని నిలదీశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు బర్మ చిన్న నర్సయ్య, పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, తాళ్ల రాంపూర్ ఎంపీటీసీ సవిత, ఎంపీడీవో కర్నె రాజేశ్, సర్పంచులు పత్తిరెడ్డి ప్రకాశ్రెడ్డి, కుండ నవీన్, మోత్కూరి మంజులా బాలజీగౌడ్, గద్దె రాధాగంగారాం, కట్కం పద్మాసాగర్రెడ్డి, అటవీశాఖ అధికారి లింగన్న, ఏర్గట్ల ఏఎన్ఎం కల్పన, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.