డిచ్పల్లి, డిసెంబర్ 17: జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోర్గాం గ్రామానికి చెందిన శబరిమాత భక్తులు ఆటోలో వేల్పూర్ మండలం లక్కోరా గ్రామానికి భజన చేసేందుకు బయల్దేరారు. జక్రాన్పల్లి వద్ద కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న కారు ఆటోను వెనుకవైపు నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో బోర్గాంకు చెందిన 8 మంది భక్తులు రోడ్డుపక్కన గల గుంతలో చెల్లాచెదురుగా పడిపోయారు.
కారులో ఉన్న బాల్కొండ మండలం వన్నెల్(బీ) గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు మహేశ్, దేవేందర్ సైతం ప్రమాదంలో గాయపడ్డారు. సంఘటనా స్థలానికి ఎస్సై శ్రీకాంత్ చేరుకొని బాధితులందరినీ 108, నేషనల్ హైవే అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మేకల నడ్పి గంగవ్వ, మేకల గంగవ్వ, ఈశ్వరమ్మ, సుగుణమ్మ, బట్టు సాయమ్మ, సుద్దలక్ష్మి, శామకూర గంగవ్వ, ఆటో డ్రైవర్ మేకల సుదర్శన్ గాయపడ్డారు. దవాఖానలో చికిత్స పొందుతున్న శామకూర గంగవ్వ(65), ఆటో డ్రైవర్ మేకల సుదర్శన్ (39) పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.