ధర్పల్లి, నవంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యం విక్రయాలకు సైతం ఇబ్బంది లేకుండా పోయింది. దీంతో కూరగాయలు, పప్పుదినుసులు పండించే రైతులంతా క్రమంగా వరిసాగుపై మొగ్గుచూపుతున్నారు. ఆరుతడి పంటలు సాగుచేసేందుకు శ్రమ ఎక్కువ ఉండడం కూడా వరిసాగుకు ఒక కారణం. డిమాండ్కు తగినట్లుగా కూరగాయలు, పప్పుదినుసులు పండించకపోవడంతో వ్యాపారులు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.
అంగళ్లలో నారు విక్రయం..
మార్కెట్లో కూరగాయలు కాసులు కురిపిస్తుండడంతో యాసంగిలో కొందరు రైతులు ఆరుతడి పంటలు పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరుతడి పంటలు వేయాలంటే అందుకు సంబంధించిన నారును సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పట్టణాలకు వెళ్లి మేలురకం విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తిన తర్వాత నెలరోజులపాటు కంటికి రెప్పలా కాపాడుకొని తిరిగి నాటుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి రంది లేకుండా అంగళ్లలో నారు విక్రయిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వారసంతలో ఉల్లి, మిరప, టమాట, వంకాయ తదితర కాయగూరల నార్లు అందుబాటులో ఉంటున్నాయి. రైతులు వీటినే కొనుగోలు చేసి పొలాల్లో నాటుకొని సాగుచేస్తున్నారు.
నారు విక్రయంతోనూ రైతులకు ఆదాయం..
ఆరుతడి పంటల కోసం నారు సిద్ధం చేసుకునేందుకు కష్టం అనుకునే వారికోసం కొందరు రైతులు రెడీగా నారు విక్రయిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల రైతులు ఇదే వ్యాపారంగా ఎంచుకున్నారు. ఉల్లి, మిరప, వంకాయ, టమాట తదితర నారును సిద్ధంచేసి ఉమ్మడి జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ధర్పల్లి మండలకేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంగడిలో పెద్ద ఎత్తున నారు విక్రయిస్తున్నారు. మండలంలోని పరిసర గ్రామాల రైతులు ఈ నారును కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. నారును సిద్ధం చేసుకునే తిప్పలు తప్పాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో ధర్పల్లి మండలంలో 18,500 ఎకరాల్లో వరి, 2 వేల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగయ్యే అవకాశాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ తెలిపారు. మార్కెట్లో నారు అందుబాటులో ఉండడంతో రైతులు ఆరుతడి పంటలు వేయడానికి మొగ్గుచూపుతున్నారని తెలిపారు.
తెచ్చిన గంటలోనే అమ్మేస్తున్నాం..
అంగళ్లలో కూరగాయల నారుకు చాలా డిమాండ్ ఉన్నది. ఉల్లి, మిరప, వంకాయ, టమాట నారును తెచ్చి ధర్పల్లి అంగడిలో అమ్ముతాం. తెచ్చిన గంటలోపే అమ్మే స్తాం. చుట్టుపక్కల గ్రామాల రైతులు నారు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. నారు అమ్మడంతోనూ మాకు ఉపాధి లభిస్తున్నది. ఏటా యాసంగిలో నారు విక్రయిస్తాం.
-రాజు, నారు విక్రయదారుడు
కొంత కష్టం తగ్గినట్లే..
ఆరుతడి పంటలు వేయాలంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. నారును సిద్ధం చేసుకోవడానికి రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడాలి. అంగళ్లలో రెడీమేడ్గా నారు అందుబాటులో ఉంటున్నది. దీంతో రైతులకు కొంత కష్టం తగ్గినట్లే. ధర్పల్లి అంగడిలో అన్ని రకాల నారు దొరుకుతున్నది. అర ఎకరానికి సరిపడా నారును కొనుగోలు చేసి తీసుకెళ్తున్న.
-గంగాధర్, రైతు, కళాశాల తండా, ధర్పల్లి మండలం