మద్నూర్, నవంబర్ 29 : మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో మంగళవారం తెలుగు ఉపాధ్యాయురాలు మహేశ్వరి విద్యార్థులపై చేయిచేసుకున్నారు. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 15 మందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టినట్లు విద్యార్థినులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మూడు రోజుల క్రితం పాఠశాలలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయురాలి ఫొటో తీసి సోది తెలుగు అని కామెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. విషయం ఉపాధ్యాయురాలికి తెలిసింది. పోస్ట్ చేసిన విద్యార్థిని పిలిచి మందలించింది. విద్యార్థిని సైతం కుటుంబ సభ్యులతో ఉపాధ్యాయురాలి ఇంటికి వెళ్లి క్షమాపణ కోరింది. ఇంతటితో ఈ వివాదం సద్దుమణిగిందనుకున్నప్పటికీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఉపాధ్యాయురాలు విద్యార్థులపై చేయి చేసుకోవడంతో తల్లిందండ్రులకు తెలియజేశారు. ప్రిన్సిపాల్ పట్టించుకోవడంలేదని విద్యార్థులు తెలిపారు. ఒక్కరు పోస్ట్ చేస్తే అందరినీ ఎందుకు కొట్టారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలిని ప్రశ్నించారు. పిల్లలు తప్పు చేస్తే తమకు చెప్పాలని, లేదంటే మందలించాలని ఆడపిల్లలని సైతం చూడకుండా ఈ విధంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని వారన్నారు. తమను కొట్టినందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ తీరుకు నిరసనగా విద్యార్థులు పాఠశాల ముందు బైఠాయించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ లావణ్యను వివరణ కోరగా విద్యార్థినులను కొట్టిన మాట వాస్తవమేనని, ఉన్నతాధికారుల దృష్టికిఈ విషయం తీసుకెళ్తానని తెలిపారు.