ధర్పల్లి, నవంబర్ 27 : కొన్నేండ్లుగా ఎదుర్కొంటున్న ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. మండలంలోని ప్రాజెక్టు రామడుగు నుంచి కేశారం, మైలారం, సల్లగరిగె, దుబ్బాక, రేకులపల్లి మీదుగా పోత్నూరి గుట్ట వరకు రోడ్డు అధ్వానంగా మారడంతో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గతంలో విడుతల వారీగా రోడ్డును వేసినప్పటికీ కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణ లోపంతో రోడ్లు మూడు నెలలకే పాడైపోయాయి. కేశారం, మైలారం రోడ్డును బాగుచేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన కేశారం, మైలారం గ్రామాలకే కాకుండా ప్రాజెక్టు రామడుగు నుంచి కేశారం, మైలారం, సల్లగరిగె, దుబ్బాక, రేకులపల్లి, పోత్నూరి గుట్ట వరకు సుమారు 10 కిలోమీటర్ల రోడ్డును బాగు చేయాలని తారు రోడ్డు నిర్మాణం కోసం ఆర్అండ్బీ శాఖ నుంచి కోటీ 80 లక్షల రూపాయలను మంజూరు చేయించారు.
త్వరలో ప్రారంభం కానున్న పనులు
రోడ్డు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆర్అండ్బీ ఏఈ మనోహర్ తెలిపారు. ఇదివరకే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మార్గంలో ఎన్నో ఏండ్ల నుంచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుకావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా ప్రారంభించేందుకు కృషిచేసిన ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీ చైర్మన్ కృషితోనే..
అధ్వానంగా మారిన కేశారం-మైలారం రోడ్డు గురించి ఎమ్మెల్యేకు విన్నవించగా వెంటనే స్పందించిన ఆయన కేశారం-మైలారం గ్రామాల రోడ్డే కాకుండా రామడుగు ప్రాజెక్టు నుంచి మా గ్రామాల మీదుగా పోత్నూరి గుట్ట వరకు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణం చేయిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామప్రజల తరఫున కృతజ్ఞతలు.
– సంగీతా భాస్కర్, సర్పంచ్, కేశారం
ప్రయాణికుల ఇబ్బందులు తొలగనున్నాయి
ఎన్నో ఏండ్ల నుంచి అధ్వానంగా ఉన్న రోడ్లతో కేశారం, మైలారం గ్రామాల ప్రజలము ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సార్ తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించాలని ఎమ్మెల్యేని అడడగా.. 10 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది.
–దూమాల దత్తాద్రి, నాయకుడు, కేశారం