రెంజల్, నవంబర్ 27: బోధన్ – బాసర- భైంసా జాతీయ రహదారి పనులను త్వరలోనే ప్రారంభం కానున్నాయని, రోడ్డులో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించడంలో సాధ్యమైనంత వరకు న్యాయం జరిగేలా చూస్తామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఆదివారం తాడ్బిలోలి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వ నిబంధనలను ఆర్డీవో వివరించారు. 161 బీబీ జాతీయ రహదారిని రూ.644.45 కోట్ల వ్యయంతో 56.4 కిలో మీటర్లు విస్తరించనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు పరిహారం విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, భూ సర్వే, సేకరణ పూర్తి చేసిన నాటి నుంచి బాధితులకు పరిహారంతోపాటు ఆడబ్బులకు వడ్డీ కలిపి 2023 సంక్రాంతి నాటికి అందజేయనున్నట్లు చెప్పారు. బోధన్ నుంచి నిర్మల్ జిల్లాలోని భైంసా వరకు ఎన్ఏహెచ్, ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే 161 బీబీని అభివృద్ధి పనులకు అగ్రిమెంట్ పూర్తి కాగానే వచ్చే ఏడాది జనవరిలో క్షేత్ర స్థాయిలో పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. బోధన్ మండలం పేగడపల్లి – రెంజల్ మండలం తాడ్బిలోలి వరకు భూసర్వేలో సేకరించిన భూములను రెండు రోజుల్లో జేసీబీతో ట్రెంచ్ కట్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో కమర్షియల్ చెట్లు టేకు, ఈత, తాడి, మామిడి, బోరు పైప్లైన్, పండ్ల తోటలు, పంట కాలువలు కోల్పోతే వాటికే మాత్రమే పరిహారం అందిస్తారని తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల స్థలం పరిశీలన
అర్హులైన లబ్ధిదారులు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకునేందుకు ఎంపిక చేసిన స్థలాన్ని ఆర్డీవో రాజేశ్వర్ పరిశీలించారు. ఓటరు నమోదు చేస్తున్న కేంద్రాన్ని తనిఖీ చేశారు. 18 ఏండ్లు నిండి, ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరూ బూత్లెవల్ ఆఫీసర్(బీఎల్వో) వద్ద పేరున ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట నాయబ్ తహసీల్దార్ శశిభూషణ్, రైతు బంధు సమితీ జిల్లా డైరెక్టర్ మౌలానా, రైతు నాయకులు నర్సయ్య, సాయారెడ్డి, హన్మంత్రావు తదితరులు ఉన్నారు.