బిచ్కుంద, నవంబర్ 27: గ్రామాల్లో 18 ఏండ్లు నిం డిన యువత ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు యువకులతో మాట్లాడారు. ఓటు ఎన్నికల్లో ఆయుధంలా పనిచేస్తుందని తెలిపారు. గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. గిర్దావర్ సాయిబాబా తదితరులు ఉన్నారు.
ఓటరు నమోదును వేగవంతం చేయాలి..
గాంధారి, నవంబర్ 27: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను అన్నారు. మండల కేంద్రంలో ఓటరు నమోదు ప్రక్రియతో పాటు, పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ గోవర్ధన్తో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు కోసం నమోదు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఓటు హక్కు నమోదుపై గ్రామాల్లో దండోరా వేయించడంతో పాటు, యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. గడువులోపు ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటు హక్కును వినియోగించుకునే వారికి పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సౌకర్యాలు కల్పించాలన్నారు. నాయబ్ తహసీల్దార్ రవి, గిర్దావర్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఓటర్ల నమోదు..
తాడ్వాయి, నవంబర్ 27: మండలంలోని పలు గ్రా మాల్లో ఆదివారం రెండో రోజు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించామని గిర్దావర్ శ్రీనివాస్ తెలిపారు. పోలింగ్ బూత్ల వారీగా ఓటరు నమోదు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జనవరి ఒకటి 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు తప్పు గా ఉన్నవారి జాబితాను సరి చేస్తున్నామన్నారు.
అర్హులందరూ నమోదు చేసుకోవాలి..
నాగిరెడ్డిపేట్, నవంబర్ 27: మండలంలో అర్హులందరూ ఓటు హక్కుకోసం నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సయీద్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి జనవరి 2023 వరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫామ్-6ను నింపి సంబంధిత అధికారికి అందజేయాలని పేర్కొన్నారు. ఓటు నమోదు కోసం డిసెంబర్ 8వ తేదీ వరకు గడువు ఉన్నదని తెలిపారు.
ఓటరు నమోదు పత్రం అందజేత..
నిజాంసాగర్, నవంబర్ 27: జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతకు ఆదివారం ఓటు నమోదు పత్రాన్ని గిర్దావర్ రాంపటేల్ అందజేశారు. గ్రామంలో ఇంకా ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన యువత ఉంటే ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ వినోద్తో పాటు ఉప సర్పంచ్ లక్ష్మణ్, సీఐటీయూ మండల అధ్యక్షుడు సురేశ్గొండ తదితరులు ఉన్నారు.
అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి..
పిట్లం, నవంబర్ 27: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని గౌరారం సర్పంచ్ శంకర్ సూచించారు. మండలంలోని గౌరారం గ్రామంలో ఓటు కోసం అర్హుల నుంచి ఆదివారం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు కార్డులు తప్పులు ఉంటే సరిచేయించుకోవాలన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇందుకు సహకరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) గ్రామ అధ్యక్షుడు హన్మంత్రావు, రైతుబంధు సమితి కన్వీనర్ రాములు, వార్డు సభ్యులు సాయిలు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.