భీమ్గల్, నవంబర్ 25: మండలంలోని గోన్గొప్పుల బోగారపు వాగుపై వంతెన లేక ప్రజలు వానకాలంలో నానా తంటాలు పడాల్సి వచ్చేది. వాన కాలం వచ్చిందంటే వాగును దాటడం ప్రాణసంకటంగా ఉండేది. సమైక్య రాష్టంలో బ్రిడ్జి నిర్మాణంపై అప్పటి పాలకులు దృష్టి సారించలేదు. ప్రజలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అవి బుట్టదాఖలు అయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సర్కారు స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. గోన్గొప్పుల బోగారపు వాగుపై బ్రిడ్జి ఆవశ్యకతను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గుర్తించారు. ఈ సంవత్సరం రూ.2.60 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. మంత్రి చొరవతో కొన్ని నెలల్లోనే బ్రిడ్జి నిర్మాణం పూరైంది. స్వల్ప కాలంలోనే పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.