ధర్పల్ల్లి/ చందూర్/ ఇందల్వాయి, నవంబర్ 25 :జిల్లాలోని పలు గ్రామాల్లో పోడుభూముల సమస్యల పరిష్కారంపై శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. ధర్పల్లి మండలంలోని ధనంబండ తండాలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాసాగర్ మాట్లాడుతూ.. ధనంబండ తండా నుంచి మొత్తం 302 పోడుభూములకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ, అటవీ అధికారులతో ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి సంయుక్త సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సర్వే వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. అటవీ హక్కుల చట్టంపై గ్రామస్తులు, గిరిజనులకు అవగాహన కల్పించారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించి వారి ఆదేశాల మేరకు హక్కు పత్రాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్, ఎంపీటీసీ సభ్యుడు గుగులోత్ స్వామి, సీఐ చంద్రశేఖర్గౌడ్, ఎస్సై వంశీకృష్ణారెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
చందూర్ మండలకేంద్రంతోపాటు ఘన్పూర్, మేడ్పల్లి గ్రామాల్లో సర్పంచులు, అధికారులు, రైతులతో కలిసి తహసీల్దార్ వసంత గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన పోడుభూముల దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించామని తెలిపారు. నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు శ్యాంరావు, సర్పంచులు సాయారెడ్డి, లకావత్ రవి, కార్యదర్శులు సాయిలు, సీతారాం, వనజ లత, సర్వేయర్ మల్లికార్జున్, గ్రామస్ధాయి అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఇందల్వాయి జీపీ కార్యాలయంలో పోడుభూములపై గ్రామసభను నిర్వహించారు. పోడుభూముల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేశామని, వివరాలను ఆన్లైన్లో నమోదు చేశామని పోడు భూముల స్పెషల్ ఆఫీసర్ ప్రకాశ్గౌడ్, టీమ్ సభ్యుడు భరత్ తెలిపారు. ఇందల్వాయి గ్రామంలో 116 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వారి పేర్లను గ్రామసభలో చదివి వినిపించారు. రికార్డులను కలెక్టర్ కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఉపసర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ సభ్యుడు సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ కొరట్పల్లి ఆనంద్, మాజీ సర్పంచులు ఆరెపల్లి దశరథ్, వాచర్ మల్లయ్య, పాశం కుమార్, మాజీ విండో చైర్మన్ పాశం నర్సింహులు, వార్డు సభ్యులు నవీన్గౌడ్, గొల్ల సాయిలు, రైతులు పాల్గొన్నారు.