కోటగిరి, నవంబర్ 25: క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి ఎంత ముఖ్యమో పేదల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పొతంగల్ను నూతన మండలంగా ఏర్పాటు చేయగా.. తహసీల్ కార్యాలయాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. పొతంగల్ మండలంలోని 14 గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన మండలాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. 2014కు ముందు బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండేవని, నేడు తొమ్మిది మండలాలు, ఒక మున్సిపాలిటీ ఏర్పాటైనట్లు తెలిపారు.
నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల కేంద్రాల్లో మండల కాంప్లెక్స్లను నిర్మిస్తున్నామన్నారు. ధనవంతులు, ఆర్థిక స్థోమత కలిగిన వారు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను ఆశించడం నేరమే కాకుండా పాపం కూడా అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పేదల కష్టాలు తీర్చాలని, నిరాదరణకు గురైన వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.200 ఉన్న పెన్షన్ను రూ. రెండు వేలకు పెంచారని గుర్తు చేశారు.
విడుతల వారీగా ‘డబుల్ ఇండ్ల’ మంజూరు
రాష్ట్రంలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గానికే పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. ఇల్లు లేని పేదలందరికీ విడుతల వారీగా మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే మూడు లక్షల రూపాయల పథకం రానున్నదని, అర్హులైన వారందరికీ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడి కేవలం ఎనిమిదేండ్లు అయినా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతోపాటు పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో 24 గంటల కరెంట్ లేదని, పండించిన వరి ధాన్యాన్ని కూడా కొనే దిక్కులేదన్నారు. ప్రజలకు మంచి చేయడానికి పోటీపడాలని, ప్రభుత్వాలను కూల్చడానికి కాదన్నారు.
సుంకిని, హెగ్డోలి, కొల్లూర్ ఎత్తిపోతల పథకాలను త్వరలో ప్రారంభిస్తాం..
నిజాంసాగర్ ఆధునీకరణతో ఆయకట్టు చివరి వరకూ సాగునీరు అందుతున్నదని అన్నారు. సుంకిని, హెగ్డోలి, కొల్లూర్ ఎత్తిపోతల పథకాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాల భూములకు సాగునీరు అందించడానికి సిద్దపూర్ రిజర్వాయర్, జాకోరా-చందూరు ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో రూ. కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని, కేజ్వీల్ ట్రాక్టర్లను నడుపొద్దని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సహకారం అందించాలని కోరారు. అంతకుముందు సభాపతిని ఘనంగా సన్మానించారు. కొల్లూర్లో గజానన్ మందిరంలో నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీటీసీ శంకర్పటేల్, స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, జడ్పీ కో-ఆప్షన్ సిరాజ్, టీఆర్ఎస్ ఉమ్మడి మండలాల కన్వీనర్ ఎజాజ్ఖాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొల్లూర్ కిశోర్బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్లు శాంతేశ్వర్పటేల్, కూచి సిద్దూ, సునీల్కుమార్, ఆశోక్పటేల్, టీఆర్ఎస్ మండల నాయకులు వి.శ్రీనివాస్, ఎంపీటీసీ కేశ వీరేశం, మాణిక్యప్పా తదితరులు పాల్గొన్నారు.
గిరిజన బాలికల వసతి గృహం తనిఖీ
పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని మౌలిక వసతులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం, ఏఏ కోర్సుల్లో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు.. తదితర అంశాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. ఒక మనిషి విద్యా జీవితంలో ఇంటర్మీయెట్ అనేది కీలకమన్నారు. జీవితంలో స్థిరపడడానికి అతి ముఖ్యమైన మలుపు అని పేర్కొన్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నా, పాడు చేసుకోవాలన్నా ఇంటర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. బైపీసీ విద్యార్థులకు పైచదువులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాలను గతేడాది బాన్సువాడ లో ప్రారంభించామని, ఎక్కువ మార్కులను తెచ్చుకుంటే ఇక్కడే సీటు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో ఎవరైనా మొదటి గ్రేడ్లో పాసైతే వారికి సన్మానం చేసేవారని, కాలానుగుణంగా ఇప్పుడు 90 శాతం పైగా మార్కులు వస్తేనే పైచదువులకు అవకాశాలు ఉంటున్నాయన్నారు.
పేదరికంతో చాలా మంది మెరిట్ విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారనే ఉద్దేశంతోనే బాన్సువాడలో అన్ని రకాల ప్రభుత్వ విద్యా సంస్థలను ఉన్నత చదువు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బాన్సువాడ మండలపరిధిలోని హన్మాజీపేట్ ప్రాంతంలో మరో గిరిజన మహిళా వసతి గృహం ఏర్పాటుకు అనుమతి లభించిందని, ఈ పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. స్పీకర్ వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కమిషనర్ కల్యాణం రమేశ్, సభాపతి వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి, నాయకులు నార్ల ఉదయ్ తదితరులు ఉన్నారు.