సిరికొండ, నవంబర్ 21: గతంలో హామ్లెట్ గ్రామాలుగా ఉన్న తండాలను ఉమ్మడి రాష్ట్ర పాలకులు పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుక్కెడు తాగునీటి కోసం వాగులు, వంకలు దాటి కిలోమీటర్ల మేర నడిచి వెళ్లేవారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ప్రస్తుతం ఆ గడ్డు పరిస్థితులన్నీ దూరమయ్యాయి. గిరిజనులే పాలకులైతే తండాలు అభివృద్ధి సాధిస్తాయని గుర్తించిన సీఎం కేసీఆర్.. 500 జనాభా ఉన్న ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీంతో గిరిపల్లెలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో అత్యధికంగా గిరిజన పల్లెలు ఉన్నాయి. 500 జనాభా ఉన్న తండాలను జీపీలుగా ప్రకటించడంతో 15 గ్రామపంచాతీలుగా ఏర్పాటయ్యాయి. గత పంచాయతీ ఎన్నికల్లో పాలకవర్గాలను ఏర్పాటు చేసుకొని తండాల్లో ఏండ్లపాటు నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పుష్కలంగా నిధులను విడుదల చేయడంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకున్నారు. మిషన్ భగీరథ పథకం కింద గిరిజన పల్లెల్లో గడపగడపకూ శుద్ధజలం సరఫరా చేస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, విలేజ్ పార్కులను ఏర్పాటు చేసుకున్నారు. చెత్తను తరలించడానికి ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీలకు దీటుగా నేడు తండా గ్రామాలు మెరుస్తున్నాయి. మండలంలోని తండాలకు స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో రోడ్డు సౌకర్యంతోపాటు చెక్ డ్యాములు నిర్మించారు.