బీర్కూర్/బాన్సువాడ, నవంబర్ 21: అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని చించొల్లి,కిష్టాపూర్ గ్రామాల్లో సోమవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చించొల్లిలో 20 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ. 21 లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులు, రూ.15 లక్షలతో నిర్మించిన మున్నూరుకాపు భవ నం, రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రా రంభించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో రూ. 56. 20 లక్షలతో చేపట్టనున్న మౌలిక సదుపాయాలు, రూ.9 లక్షలతో చేపట్టనున్న అంగన్వాడీ భవన నిర్మాణం, రూ.7 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కిష్టాపూర్ గ్రామంలో 80 డబుల్ బెడ్ రూం ఇండ్లతోపాటు రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన పేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని, అనర్హులకు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యధికంగా పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లు బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరైనట్లు తెలిపారు. మెజారిటీ ఇండ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారని చెప్పారు. లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే దృఢంగా ఉంటుందన్నారు. త్వరలోనే రూ.3లక్షల పథకం వస్తుందని, అర్హులైన వారందరికీ ఇండ్లు మం జూరు చేయిస్తామన్నారు.
తెలంగాణ రాక ముం దు, వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చిందో మన కండ్ల ముందు కనిపిస్తోందన్నారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఉచిత విద్యుత్ వద్దని, మీటర్లు పెట్టాలని కేంద్రం అడిగితే ముఖ్యమంతి కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. తన కన్నా ముందు బాన్సువాడ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వారు ఎత్తిపోతల నిర్మాణం చేపట్టలేదని, లిఫ్ట్లన్నీ తాను ఏర్పాటు చేయించినవని వివరించారు. కిష్టాపూర్ గ్రామ పరిధిలోని భూములకు నిజాంసాగర్ కాలువ ద్వారా నీళ్లు రావడానికి 25వ డిస్ట్రిబ్యూటర్ నుంచి రూ.18 కోట్లతో సిమెంటు లైనింగ్ చేయించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న పథకాలపై ఆయా శాఖల అధికారులతో వివరాలను గ్రామస్తులకు చెప్పించారు. ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, సర్పంచులు అంబయ్య, బాబూరావు, ఎంపీటీసీ భారతి, నాయకులు సందీప్, లడేగాం గంగాధర్, రాజు తదితరులు పాల్గొన్నారు.