ఆర్మూర్, నవంబర్ 20: క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ అన్నారు. ఆదివారం ఆర్మూర్లోని సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలలో నిర్వహించిన 7వ రాష్ట్ర సబ్జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేసి మాట్లాడారు. జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో ఎంపికైన జట్లు కర్నూల్లో ఈనెల 25 నుంచి నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు.
కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శోభన్బాబు, పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ మున్నాబాయి, రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ కోశాధికారి అబిషేక్గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కంటి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి మార్కంటి సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రథమస్థానంలో మెదక్, ద్వితీయ స్థానంలో నిజామాబాద్, తృతీయ స్థానంలో మంచిర్యాల జట్లు నిలిచాయి. ప్రతిభ చూపిన నిజామాబాద్కు చెందిన డి.వినీశ్, మెదక్కు చెందిన మహిపాల్, మంచిర్యాల్కు చెందిన శశాంక్, కామారెడ్డికి చెందిన లక్వేందర్కు ప్రత్యేక బహుమతులను టోర్నీ నిర్వాహకులు అందజేశారు.