నిజామాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కేంద్రంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అవలంభిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని దెప్పిపొడుస్తున్నారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యకాలంలోనే పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం విషయంలో తలెత్తిన పరిణామాలపై వివాదాస్పద కామెంట్లు చేయడంపై సభ్యసమాజం దుమ్మెత్తి పోసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీకి ఇది తగదంటూ వాడవాడలో ప్రధాని దిష్టిబొమ్మలకు తెలంగాణ సమాజం అగ్గి పెట్టింది. శవయాత్రలు నిర్వహించి తీవ్రస్థాయిలో నిరసన తెలిపింది. తాజాగా మోదీ బాటలోనే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ అహంకార పూరిత వ్యాఖ్యలు చేయడంపై రైతులు, మహిళలు, తెలంగాణ యువత తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నది. వడ్ల కొనుగోలు విషయం లో మాటిమాటికీ పేచీలు పెడుతున్న కేంద్ర సర్కారు తన వైఖరిని స్పష్టం చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం పట్టుబడితే సూ టిగా సమాధానం చెప్పలేక తెలంగాణ ప్రజలపై నోరు పారేసుకున్నాడు. మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలంటూ మాట్లాడడం పై అంతటా అగ్గిరాజుకుం టున్నది. పీయూష్ గోయల్ను దేశం నుంచి తరిమేయాలంటూ తెలంగాణవాదులు, కర్షకలోకం ఆగ్రహిస్తున్నది.
ఆత్మగౌరవంపై దాడి..
తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి అడుగడుగునా చావుదెబ్బ తగులుతున్నది. దక్షిణాది రాష్ర్టాల్లో దొడ్డిదారిలోనైనా పాగా వేయాలని భావిస్తున్న కాషాయ పార్టీ కనికరం లేకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్నది. ఇందుకోసం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, నిత్యం ఘర్షణలకు బీజేపీ కేంద్ర బిందువుగా మారడం, దాడులు చేసి తిరిగి ఎదురుదాడి చేయడం, ప్రశాంత వాతావరణంలో ఏదో రకంగా అలజడి సృష్టించి తమ వైపు అమాయక ప్రజలను తిప్పుకునేందుకు కుటిల యత్నాలకు ఒడిగడుతున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజల ఆహార అలవాట్లు, జీవన విధానంపై, ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడిన రాష్ట్ర విభజన ప్రక్రియపై ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ నాయకులు ఒకటేమిటి వరుస పెట్టి అనేకనేక వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన సంబురంలో ప్రజలు ఉంటే… ఎనిమిదేండ్ల తర్వాత ఏపీ పునర్విభజనపై మోదీ చేసిన నానా యాగి మన ప్రజల ఆత్మగౌరవంపై చేసిన దాడియే. అంతేకాక కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ సైతం నూకలను తెలంగాణ ప్రజలకు అలవాటు చేయాలంటూ మాట్లాడడం సిగ్గుచేటంటూ ప్రజానీకం దుమ్మెత్తి పోస్తున్నారు.
బీజేపీ పిచ్చి ప్రేలాపనలు..
బాధ్యత గల పదవుల్లో ఉన్నోళ్లు ప్రజలకు మేలు చేయాలి. కానీ తెలంగాణలో బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచిన వారంతా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడేండ్లుగా వడ్ల కొనుగోళ్లలో పేచీలు పెడుతున్నది. ఈ పరిస్థితులపై సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. బీజేపీ మొండి వైఖరిపై యుద్ధం చేస్తూనే రైతులను నష్టాల నుంచి తప్పించేందుకు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. ఇతర పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటే ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ లాంటి వాళ్లు వరి సాగు చేయాలంటూ రెచ్చగొట్టారు. బీజేపీ పిచ్చి ప్రేలాపనలకు రైతులు ఆకర్షితులై వరి సాగు చేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కొంతమంది సర్కారు సూచనలు పాటించి పత్తి, మక్కజొన్న, అపరాలు, కూరగాయల సాగుతో రూ. లక్షల్లో ఆదాయం సంపాదించారు. బీజేపీ నేతల తప్పుడు మాటలు విని వరి సాగు చేసిన వారికి ఇప్పు డు అదే బీజేపీ ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో ఎటూ అర్థం కాని దుస్థితి ఏర్పడింది. 2020 వానకాలం సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం 2,38,138 ఎకరాలుండగా జోరు వానలతో అమాంతం 3,86,156 ఎకరాల్లో వరి సాగైంది. 2021 వానకాలంలో 3లక్షల 52వేల594 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. సాధారణ వరి విస్తీర్ణం 2లక్షల 86వేల ఎకరాలైతే 123 శాతం మేర వరి పంటను రైతులు సాగు చేశారు. 2020 యాసంగి సీజన్తో పోలిస్తే 2021 యాసంగిలో వరి సాగు భారీగా పెరిగింది. 2021 యాసంగిలో 3లక్షల 87వేల ఎకరాల్లో వరి సాగవ్వగా… 2022 ప్రస్తుత యాసంగిలో 3లక్షల 46వేల ఎకరాల్లో సాగైంది. సుమారుగా 50వేల ఎకరాల వరకు ఇతర పంటల సాగుకు వ్యవసాయ శాఖ రైతులను సన్నద్ధం చేసింది.
సూటిగా సమాధానం చెప్పలేక..
వడ్ల కొనుగోలు విషయంలో కొంతకాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర గందరగోళంలో పడేస్తున్నది. రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. నిజానిజాలను పక్కన పెట్టి అబద్ధాలను వల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాధినేతగా ఉంటూ నోటికొచ్చినట్లుగా దూషిస్తున్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మూలంగా రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఆరుగాలం చేసిన కష్టం కండ్లముందే ఆవిరై పోతుంటే, పెట్టిన పెట్టుబడి ఎట్లా తీర్చాలో తెల్వక వరికుప్పలపై పడి ఏడుస్తున్నారు. యాసంగిలో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ముందస్తుగానే అప్రమత్తం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ధోరణితో రాష్ట్రమే ధాన్యం కొనాలంటూ వితండవాదం చేస్తున్నది. అసలేం జరుగుతుందో తెలియక పండించిన ధాన్యం ఎట్లా అనే భావనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బీజేపీ చేతగానితనాన్ని రాష్ట్రంపై మోపుతున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తే, మర ఆడించి బియ్యంగా మార్చి వాటిని ఎఫ్సీఐకి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్రం ఓ వైపు చెబుతున్నది. ఇదేమీ కొత్త కాదు. దశాబ్దాలుగా ఇదే విధానం కొనసాగుతున్నది. రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతుండడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాల్సిందే..
యాసంగిలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేయాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రెండు పంటలు(వరి, గోధుమలు) నూరు శాతం ఎఫ్సీఐ ద్వారా కొంటున్నట్లుగా తెలంగాణాలో కూడా వడ్లను కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తీర్మానాలు పంపాలని పేర్కొన్నారు.
నూకలు తినమనడం మంచిది కాదు..
తెలంగాణోళ్లు నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనడం భావ్యం కాదు. నా చిన్నతనం నుంచే మేలు రకాలైన వడ్లను పండించి నాణ్యమైన బియ్యాన్ని వండి పెట్టి మా అమ్మానాన్నలు మమ్మల్ని ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుండు. ఎద్దేడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన దేశం బాగుండదని నమ్మిన రైతుబిడ్డ కేసీఆర్ కాబట్టే రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, సాగునీరు సమృద్ధిగా అందిస్తుండు. కానీ కేంద్రంలోని బీజేపోళ్లు వడ్లు కొనబోమంటూ అనవసరంగా మాట్లాడుతూ తెలంగాణ రైతుల్ని అణచాలని చూస్తుండ్రు. రైతన్న ఉసురు తగిలిన వాడు చరిత్రలో బాగుపడ్డట్లు నాకు తెలిసినంతగా లేదు.
– ఇట్టెడి వెంకన్న, రైతు, కోటార్మూర్, ఆర్మూర్
వాళ్లకు నూకలు చెల్లినయ్..
రైతును నూకలు తినుమని జెప్పుతున్నరంటే అచ్చే ఎలక్షన్ల వాళ్ల్లకు నూకలు జెల్లినట్లే అనిపిస్తున్నది. ఓట్లప్పుడు గుర్తు జేస్తం నూకలు తినుమన్న ముచ్చట్లన్నీ. తెలంగాణ నిండుగ అడ్లు పండిత్తున్నది. గా వడ్లు గొనండి సార్లు అంటే కేంద్రం ఇసెంత్రాలు మాట్లాడుతున్నది. ముందు ముందున్నది మీకు నగువట్ల ముచ్చట.
-లింగాల పోతన్న, రైతు, బాల్కొండ
కేసీఆర్ సార్..మనం తగ్గేదే లే
గాడ పంజాబ్ల ఎట్లయితే అడ్లు మొత్తం గొంటున్నరో మా తెలంగాణల పండిన అడ్లన్నీ గొనుమంటున్నడు మా సీఎం సారు. గా మాట మంచిగ అడుగుదం అని మా మంత్రులను ఢిల్లీకి వంపితే గా పీయూష్ గోయల్ అనేటాయన ఎకసెక్కాలు మాట్లాడుడు తరీఖనేనా. గీల్లు గిట్ల జేత్తున్నరనే వడ్లు మొత్తం కొనాలని లడాయ్ చేద్దమంటున్నడు కేసీఆర్ సారు. కేసీఆర్ సారూ.. కేంద్రం మన వడ్లన్నీ కొనేదాక మనం తగ్గేదే లేదు సారు.
-బూక్య హీరా, గిరిజన మహిళా రైతు, బట్టాపూర్, ఏర్గట్ల మండలం
ఇలాగేనా మాట్లాడేది..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతులను.. రైతుల పక్షాన విన్నవించడానికి వెళ్లిన వారితో దిగజారి మాట్లాడారు. కేంద్రమంత్రిగా ఉండి ఇంత అధమ స్థాయిలో మాట్లాడడం సిగ్గు చేటు. పద్ధతిగా మాట్లాడడం ఎలాగో మా మంత్రులను చూసి గోయల్ నేర్చుకోవాలి
-పోశెట్టి, అమీర్నగర్, వేల్పూర్ మండలం